బాలీవుడ్ రెడీ.. భారీ చిత్రం విడుదల ఖరారు


మొత్తానికి కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి బాగానే తగ్గింది. చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ షరతులను సడలిస్తున్నారు. పగటి పూట కార్యకలాపాలకు ఏ ఇబ్బందీ ఉండట్లేదు. వ్యాపారాలన్నీ పుంజుకుంటున్నాయి. రోజువారీ కరోనా కేసుల సంఖ్య లక్ష దిగువకు రావడం, మరణాల సంఖ్య కూడా బాగా తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ నెలాఖరుకు కేసులు, మరణాల సంఖ్య మరింత తగ్గుతుందని, నార్మల్సీ దిశగా మరింత ముందడుగు పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వచ్చే నెల నుంచి థియేటర్లు తెరుచుకుంటాయన్న అంచనాతో ఉన్నారు.

మహారాష్ట్రలో అయితే ఇప్పటికే థియేటర్లు తెరుచుకుని 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో కొత్త సినిమాల విడుదల దిశగా అడుగులు పడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఒక భారీ చిత్రం విడుదల తేదీని కూడా కూడా ప్రకటించారు. ఆ చిత్రమే.. బెల్‌బాటమ్.

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రంజిత్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.. బెల్‌బాటమ్. ఈ చిత్రాన్ని జులై 27న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత వశు భగ్నాని ప్రకటించాడు. చిన్న, మీడియం రేంజ్ సినిమాలే రిలీజ్ విషయంలో తటపటాయిస్తుంటే.. ఈ భారీ చిత్రానికి ఉన్నట్లుండి రిలీజ్ డేట్ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు జులై 27 నాటికి థియేటర్లు మామూలుగా నడుస్తాయా.. ఆక్యుపెన్సీ 100 శాతానికి వస్తుందా అన్న విషయంలో సందేహాలున్నాయి. కరోనా మూడో వేవ్ ముప్పు కూడా పొంచి ఉండటంతో మిగతా చిత్రాల నిర్మాతలు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.

ఐతే ఇలాంటి సందేహాలతోనే ఫస్ట్ వేవ్ తర్వాత బాలీవుడ్లో పేరున్న సినిమాల విడుదలే లేక ఆ పరిశ్రమ కాస్తయినా కోలుకోలేకపోయింది. దక్షిణాది సినీ పరిశ్రమలో సందడి నెలకొన్న టైంలో బాలీవుడ్ మాత్రం వెలవెలబోయింది. ఐతే సెకండ్ వేవ్ తర్వాత కూడా ఇదే ధోరణి అవలంభిస్తే బాలీవుడ్ పుట్టి మునగడం ఖాయమని భావించి ఈసారి అక్కడి వాళ్లు త్వరపడుతున్నట్లు కనిపిస్తోంది. ‘బెల్ బాటమ్’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ నేపథ్యంలో మున్ముందు మరిన్ని చిత్రాలకు విడుదల తేదీలు ఖరారవుతాయని భావిస్తున్నారు.