మహిళల్నే అలా ఎందుకు ప్రశ్నిస్తారో..

బాలీవుడ్ లో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది విద్యాబాలన్. ‘డర్టీ పిక్చర్’ లాంటి సినిమాలో తన హాట్ పెర్ఫార్మన్స్ తో షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ ‘కహానీ’, ‘మిషన్ మంగళ్’ లాంటి చిత్రాల్లో గృహిణిగా వెండితెరపై ఎంతో పద్దతిగా కనిపించింది. గతేడాది ఆమె నటించిన ‘శకుంతల దేవి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉండగా.. తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లింగ వివక్ష గురించి విద్యాబాలన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

డిన్నర్ టైమ్ లో అందరూ తనకు వంట చేయడం రాదని.. తప్పనిసరిగా వంట నేర్చుకోమని చెప్పేవారని.. ఇక్కడ నుండే లింగ వివక్ష అనేది మొదలవుతుందని చెబుతోంది విద్యాబాలన్. ఎవరైనా తనను వంట గురించి ప్రశ్నించినప్పుడు తన భర్తకు కూడా వంట రాదని చెప్పేదాన్నని.. కానీ వాళ్లు ఒప్పుకునేవారు కాదని.. నువ్ కచ్చితంగా వంట నేర్చుకోవాల్సిందే అనేవారని తెలిపింది. ఇప్పటికీ మహిళల్నే అలా ఎందుకు ప్రశ్నిస్తారో తనకు అర్ధం కాదని అంటోంది.

నాకు తెలిసి అందరం లింగ వివక్ష ఎదుర్కొనే ఉంటామని చెప్పింది. ఆపోజిట్ సెక్స్ ఉంది మాత్రమే కాకుండా.. ఓ మహిళను మరో మహిళ ప్రశ్నించడం చూస్తే తనకు విపరీతమైన కోపం వస్తుందని చెప్పింది. లాక్ డౌన్ సమయంలో వంట చేయడానికి ప్రయత్నించానని.. కానీ వర్కవుట్ కాలేదని.. సో తన స్టాఫ్ కు సహకరించినట్లు చెప్పింది.

తన తల్లి కూడా ఇంట్లో వంట నేర్చుకోమని చెప్పేదని.. ఆమె చెప్పిన ప్రతీసారి ‘డబ్బులు సంపాదిస్తున్నా కదా.. కాబట్టి వంట మనిషిని పెట్టుకుంటా.. లేదంటే వంట తెలిసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటా’ అని సమాధానాలు ఇచ్చేదాన్ని అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘షేర్నీ’ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.