బన్నీ వాసుకి క్లాస్ పీకిన అల్లు అరవింద్!

చాలా ఏళ్లుగా అల్లు కాంపౌండ్ లో పని చేస్తూ.. బన్నీ సినిమా వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకునేవాడు వాసు. దీంతో ఆయన్ని బన్నీ వాసు అని పిలవడం మొదలుపెట్టారు. కొన్నాళ్లపాటు గీతాఆర్ట్స్ సంస్థలోనే పని చేసిన ఇతడు ఇప్పుడు నిర్మాతగా మారి ‘జీఏ 2’ బ్యానర్ పై సినిమాలను నిర్మించడం మొదలుపెట్టాడు. అయితే రీసెంట్ గా ఈ బ్యానర్ పై వచ్చిన ‘చావు కబురు చల్లగా’ సినిమా థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. తొలిరోజే ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది.

ప్రమోషన్స్ ఎంత గట్టిగా చేసినా.. కథలో సత్తా లేకపోవడంతో సినిమా ఎక్కువ రోజులు ఆడలేదు. ఆ తరువాత ‘ఆహా’లో విడుదల చేస్తే అక్కడ కూడా ఎక్కువ వ్యూస్ రాలేదు. ఈ సినిమా విషయంలో అల్లు అరవింద్ అప్సెట్ అయ్యారట. కానీ చేసేదేం లేక ఊరుకుండిపోయారు. ఇప్పుడు ఇదే బ్యానర్ పై బన్నీ వాసు మరికొన్ని సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతుండడంతో అల్లు అరవింద్ అతడిని పిలిచి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘చావు కబురు చల్లగా’ సినిమా విషయంలో జరిగిన తప్పులు మళ్లీ రిపీట్ కావడానికి వీళ్లేదని చెప్పారట.

కథ విషయంలో జాగ్రత్తలు తీసుకోమని.. ఇలాంటి ప్రెస్టీజియస్ బ్యానర్ లో వచ్చే సినిమాలు క్వాలిటీతో ఉండాలని చెప్పారట. కథ బాగుండడంతో పాటు దర్శకుడిలో సినిమా ఎగ్జిక్యూట్ చేసే సత్తా ఉందనిపిస్తేనే ముందుకు వెళ్లమని సలహా ఇచ్చారట. ‘గీతాఆర్ట్స్’ బ్యానర్ టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది. ఈ బ్యానర్ పై అన్నీ భారీ బడ్జెట్ సినిమాలనే రూపొందిస్తున్నారు. అందుకే సెపరేట్ గా ‘జీఏ 2’ బ్యానర్ మొదలుపెట్టి చిన్న,మీడియం బడ్జెట్ సినిమాలు కూడా తీయడం మొదలుపెట్టారు.