పైరసీలో కొట్టుకుపోతున్న రాధె

సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘రాధె’ రెండు రోజుల కిందటే విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసిన మేకర్స్.. ఇండియాలో థియేటర్లు మూత పడి ఉన్న నేపథ్యంలో జీ ఓటీటీలు, డీటీహెచ్‌ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల చేశారు. ఐతే ఈ చిత్రానికి నిర్ణయించిన రేటు విషయంలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఇప్పటిదాకా ఇండియాలో మరే చిత్రానికి లేని విధంగా పే పవర్ వ్యూ రేటు రూ.249 పెట్టారు. ఇంతకుముందు ‘జీ’లోనే విడుదలైన ‘కాలి పీలి’ సినిమాకు రూ.200 రేటు పెట్టారు. ఆ చిన్న సినిమాకే అంత రేటన్నపుడు సల్మాన్ చిత్రానికి రూ.249 ఎక్కువ కాదు అనుకుని ఉండొచ్చు. కానీ ఆ డబ్బులకు తగ్గట్లు ‘రాధె’లో కాస్తయినా విషయం ఉంటే కథ వేరుగా ఉండేది.

సల్మాన్ కెరీర్లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా ‘రాధె’ను పేర్కొంటున్నారు విమర్శకులు.తొలి రోజు ‘రాధె’ చూద్దామని సల్మాన్ డైహార్డ్ ఫ్యాన్స్ బాగానే ఎగబడ్డారు కానీ.. రెండో రోజు నుంచి అంతా చల్లబడిపోయింది. సినిమాకు కనీస స్పందన కొరవడింది. ఇది రూ.249 పెట్టి ఓటీటీలో చూడాల్సిన సినిమా ఎంతమాత్రం కాదనే సందేశం జనాల్లోకి వెళ్లిపోయింది. ఇంతలో ‘రాధె’ పైరసీ వెర్షన్లు బయటికి వచ్చేశాయి.

విదేశాల్లో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసిన నేపథ్యంలో అక్కడి నుంచే పైరసీ వెర్షన్లు బయటికి వచ్చి ఉండొచ్చు. లేదా ఇండియాలో కొన్ని చోట్ల పరిమితంగా థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. అక్కడైనా పైరసీ జరిగి ఉండొచ్చు. ఎలాగైతేనేం రెండో రోజు నుంచే ఇంటర్నెట్లో ‘రాధె’ పైరసీ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. సినిమాకు మంచి టాక్ వచ్చి ఉంటే ఓటీటీలోకి వెళ్లి డబ్బులు పెట్టేవాళ్లేమో కానీ.. మామూలు చిత్రం అనేసరికి పైరసీ వైపు చూస్తున్నారు చాలామంది.

తాము చాలా తక్కువ రేటుతో ఓటీటీలో సినిమాను చూపిస్తున్నామని, పైరసీ చేయడం కరెక్ట్ కాదని, దాని వల్ల ప్రమాదంలో పడతారని సల్మాన్ సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా పెట్టాడు. కానీ పెద్దగా ఫలితం లేనట్లే ఉంది. ఓటీటీలో సినిమాకు కనీస స్పందన కరవై, పైరసీ వెర్షన్ హల్‌చల్ చేస్తోంది. ఈ ప్రవాహంలో సినిమా కొట్టుపోయినట్లే అంటున్నారు.