దటీజ్ సూర్య అండ్ ఫ్యామిలీ


అధికారం చేపట్టిన నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి అందరూ ప్రయత్నిస్తారు. సినీ జనాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రభుత్వం మారగానే వెళ్లి అభినందలు చెప్పడం.. లేదా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం.. ప్రశంసలు కురిపించడం మామూలే. ఆ టైంలో వెళ్లి ప్రభుత్వ అధినేతను కలిసి వస్తే తమ పట్ల అధికారంలో ఉన్న వాళ్లకు సానుకూల అభిప్రాయం ఉంటుందని, అవసరం పడ్డపుడు పనులు అవుతాయని, తమకు ఏ రకమైన ఇబ్బందీ రాదని సెలబ్రెటీలు ఈ పని చేస్తుంటారు. తర్వాత కూడా సందర్భం వచ్చినపుడల్లా అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి.

తాజాగా తమిళనాట ఎన్నికల్లో అనుకున్నట్లే డీఎంకే పార్టీ జయకేతనం ఎగురవేయడం, కరుణానిధి తనయుడు స్టాలిన్ ముఖ్యమంత్రి కావడం తెలిసిందే. ఆయన సీఎం ఆఫీసులో అడుగు పెట్టడం ఆలస్యం.. సినీ ప్రముఖులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడిపోయారు.

స్వయంగా ఎన్నికల్లో పోటీ పడ్డ కమల్ హాసన్‌కు తోడు ఎంతోమంది సినిమా వాళ్లు స్టాలిన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఇప్పుడు స్టార్ హీరో సూర్య కూడా తన తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తిలతో కలిసి వెళ్లి ముఖ్యమంత్రిని మీట్ అయ్యాడు. ఐతే మిగతా వాళ్లు ఒక పుష్పగుచ్ఛంతోనో, ఏదైనా బహుమతితోనో వెళ్లి స్టాలిన్‌ను కలిసి వస్తే.. సూర్య కుటుంబం మాత్రం కోటి రూపాయల చెక్కుతో వెళ్లి ఆయన్ని కలిసింది. కరోనా కల్లోలం నేపథ్యంలో సహాయ చర్యలు చేపట్టడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ మొత్తాన్ని అందజేశారు.

అగరం ఫౌండేషన్ తరఫున వందల మంది పిల్లలకు తిండి పెడుతూ విద్యనందించడమే కాదు.. కరోనా వేళ మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది సూర్య కుటుంబం. గత ఏడాది కరోనా టైంలోనూ ఆ కుటుంబం విరాళం ఇవ్వడంతో పాటు ఎంతో చేసింది. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లి కోటి రూపాయల విరాళం ఇవ్వడం పట్ల ఆ కుటుంబంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.