ఎన్టీఆర్ నోట ప్రశాంత్ నీల్ మాట


‘అరవింద సమేత’ తర్వాత రెండేళ్లకు పైగా ‘ఆర్ఆర్ఆర్’కు అంకితమైపోయి ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. దీని తర్వాత అతడి సినిమాల లైనప్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముందుగా తనకు ‘జనతా గ్యారేజ్’ లాంటి సూపర్ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అతను ఓ సినిమా చేయాల్సి ఉంది. ఐతే ఈ సినిమా గురించి నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అప్పుడప్పుడూ అప్‌డేట్లు వస్తున్నాయి కానీ.. దీని గురించి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ మాట్లాడింది లేదు.

‘కేజీఎఫ్-2’ పూర్తవగానే ఎన్టీఆర్‌తో సినిమా అనుకుంటే ప్రశాంత్ ఉన్నట్లుండి ‘సలార్’ను ముందుకు తీసుకురావడం, మధ్యలో అల్లు అర్జున్ సైతం ప్రశాంత్‌తో ఓ సినిమా కోసం చర్చలు జరపడంతో ఎన్టీఆర్-ప్రశాంత్ సినిమా మీద కొంత సందేహాలు నెలకొన్నాయి.

ఐతే ఇప్పుడు ఎన్టీఆర్ తొలిసారిగా ప్రశాంత్ నీల్‌తో చేయబోయే సినిమా గురించి నోరు విప్పాడు. ప్రస్తుతం కరోనా బారిన పడి ఇంట్లో కోలుకుంటున్న తారక్.. అంతర్జాతీయ ఫిలిం ట్రేడ్ పబ్లికేషన్ ‘డెడ్ లైన్’కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తారక్ కరోనా పాజిటివ్‌గా తేలడానికి ముందు ఇచ్చాడా, తర్వాతా అన్నది తెలియదు. ఐతే ఆ ఇంటర్వ్యూ మాత్రం తాజాగా పబ్లిష్ అయింది.

ఇందులో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. తన తర్వాతి సినిమా కొరటాల శివ దర్శకత్వంలోనే అని తారక్ ధ్రువీకరించాడు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత తమ కలయికలో రానున్న సినిమా కోసం ఉత్సాహంగా ఉన్నానని.. ఐతే ఈ సినిమాకు ఇంకా స్క్రిప్టు పూర్తి కాలేదని ఎన్టీఆర్ చెప్పాడు. ఈ సినిమా కోసం ఒక ఐడియా అనుకున్నామని, అది తనకెంతో నచ్చిందని, దాని మీద వర్క్ జరుగుతోందని తారక్ తెలిపాడు. ఈ చిత్రం తర్వాత తాను ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో నటించబోతున్నట్లు ధ్రువీకరించిన తారక్.. అంతకుమించి ఆ ప్రాజెక్టు గురించి వివరాలేమీ చెప్పలేదు.