పుష్ప.. ఈజీగా తేలే యవ్వారం కాదు

అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘పుష్ప’కు పునాది పడి రెండేళ్లు దాటింది. ముందు మహేష్ బాబు కోసం ఈ కథను మొదలుపెట్టి.. తర్వాత దాన్ని అల్లు అర్జున్ కోసం మళ్లించాడు సుకుమార్. ‘రంగస్థలం’ తర్వాత తన నుంచి రాబోయే చిత్రం కావడంతో దీనిపై ఉన్న అంచనాలను అందుకోవడం కోసం కెరీర్లో మరే సినిమాకూ లేనంతగా ఈ స్క్రిప్టు మీద శ్రమించాడు సుకుమార్.

స్క్రిప్టు తయారవడంలో ఆలస్యానికి తోడు.. వేరే కారణాలు కూడా తోడై ఈ సినిమా పట్టాలెక్కడంలో, ఆ తర్వాత షూటింగ్ చేయడంలోనూ ఆలస్యం తప్పలేదు. గత కొన్ని నెలల్లో రెగ్యులర్ షూటింగ్ కొంచెం జోరుగా నడుస్తుంటే ఒకటికి రెండుసార్లు కరోనా కారణంగా షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. ఒకసారి షూటింగ్‌ను ఆపి, పున:ప్రారంభించాక ఏం జరిగినా చిత్రీకరణ ఆపొద్దన్నట్లుగా పని కొనసాగించారు. చివరికి హీరో అల్లు అర్జునే కరోనా బారిన పడటం, మిగతా యూనిట్ సభ్యుల్లోనూ కొన్ని పాజిటివ్ కేసులు బయటపడటంతో చిత్రీకరణ ఆపక తప్పలేదు.

ఎన్ని రోజులు పని చేసినా, ఎంత కష్టపడ్డా కూడా ఇప్పటిదాకా సగం సినిమా కూడా అవ్వలేదు. ఇప్పుడే విలన్ పాత్ర రంగ ప్రవేశం చేయగా.. దాంతో ముడిపడ్డ సన్నివేశాలు భారీ స్థాయిలో ఉన్నాయట. ఇందులో హీరో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ స్థాయి నుంచి అంతర్జాతీయ స్మగ్లర్ స్థాయికి ఎదిగే క్రమాన్ని కూడా భారీ లొకేషన్లలో చిత్రీకరించాల్సి ఉందట.

ఇప్పటిదాకా ఎక్కువగా ఒక పల్లెటూరి సెట్లో, అటవీ ప్రాంతంలో సన్నివేశాల చిత్రీకరణ సాగింది. అసలు కష్టమంతా ఇక మీదటే ఉందని.. చాలా లొకేషన్లు తిరగాల్సి ఉందని.. ఇండియాలో కరోనా విలయం అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ అంత తేలిగ్గా తెగే వ్యవహారం కాదని.. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక సుకుమార్ తల పట్టుకుంటున్నాడని.. ఆగస్టు 13 సంగతలా ఉంచితే.. దసరాకు కూడా ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు తక్కువే అని.. ఈ ఏడాది సినిమా రాకపోయినా ఆశ్చర్యం లేదని చిత్ర వర్గాలు చెప్పుకుంటున్నాయి.