తన సినిమా రిలీజ్.. హీరోకు నచ్చట్లేదా?

తమిళ స్టార్ హీరో ధనుష్.. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించిన ‘జగమే తంత్రం’ ఏడాది కిందటే పూర్తయినా ఇప్పటిదాకా విడుదలకు నోచుకోలేదు. గత ఏడాది లాక్‌డౌన్ మొదలయ్యాక.. థియేటర్లు మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయా అని చూశారు. థియేటర్లు పున:ప్రారంభమయ్యాకేమో నిర్మాత శశికాంత్ సైలెంటుగా ఉండిపోయాడు.

కొన్ని రోజులకు ‘జగమే తంత్రం’ను నేరుగా నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయడానికి ఆయన ఒప్పందం చేసుకున్నాడు. దీని పట్ల ధనుష్ అభిమానులు అప్పట్లో భగ్గుమన్నారు. థియేటర్లలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో ఉద్యమం చేశారు.ఈ విషయంలో ధనుష్ మీద కూడా వాళ్లు విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో అతను ‘జగమే తంత్రం’ ఓటీటీ రిలీజ్‌పై స్పందించక తప్పలేదు. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలన్నదే తన అభిమతమని, అలాగే జరగాలని కోరుకుందామని ఒక ట్వీట్ వేసి వదిలిపెట్టాడు.

‘జగమే తంత్రం’కు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయడం ధనుష్‌కు నచ్చలేదని అప్పుడే తేలిపోయింది. ఐతే జరిగిందేదో జరిగిపోయిందని.. సినిమా విడుదలపై తుది నిర్ణయం నిర్మాతదే కదా అని అతను సర్దుకుపోతాడని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. తాగాజా ‘జగమే తంత్రం’ రిలీజ్ డేట్ ప్రకటించారు. జూన్ 18న ఈ సినిమాకు నెట్ ఫ్లిక్స్‌లో ప్రిమియర్స్ పడబోతున్నాయి. దీని గురించి నిర్మాతే కాక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సైతం ట్వీట్ వేశాడు.

కానీ ధనుష్ ఆ ట్వీట్లను రీట్వీట్ చేయడం కానీ.. సొంతంగా ట్వీట్ వేయడం కానీ.. ఇంకే రకంగానైనా స్పందించడం కానీ చేయలేదు. దీన్ని బట్టి ‘జగమే తంత్రం’ సినిమాతో అతను డిస్కనెక్ట్ అయిపోయాడని.. దర్శక నిర్మాతలతో టచ్‌లో లేడని స్పష్టమైపోయింది. ఇదిలా ఉంటే ధనుష్ నుంచి ఇటీవలే వచ్చిన ‘కర్ణన్’ థియేటర్లలో 50 పర్సంట్ ఆక్యుపెన్సీతోనే చాలా బాగా ఆడింది. ఎప్పుడో పూర్తయిన ‘జగమే తంత్రం’ను చాలా ముందే థియేటర్లలోకి వదిలేయాల్సిందన్నది ధనుష్, అతడి అభిమానుల అభిప్రాయం.