థియేటర్లలో చూడరు.. ఓటీటీలో బ్రహ్మరథం


కొన్ని సినిమాలకు దక్కే ఫలితం చూస్తే ప్రేక్షకుల నాడి పట్టుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. వాళ్లు ఎప్పుడు ఏ సినిమాను ఆదరిస్తారో.. ఏ సినిమాను తొక్కి పడేస్తారో అర్థం కాదు. కొన్నిసార్లు మంచి టాక్ వచ్చిన సినిమాను కూడా థియేటర్లకు వెళ్లి చూడరు. కొన్నిసార్లు యావరేజ్ టాక్ దక్కించుకున్న సినిమాను విరగబడి చూసేస్తుంటారు. ఓ మోస్తరు విజయం అందుకోవాల్సిన సినిమాలు బ్లాక్‌బస్టర్లు అవుతుంటాయి. మినిమం గ్యారెంటీ అనుకున్న చిత్రాలు తీవ్ర నిరాశకు గురి చేస్తుంటాయి.

ఈ మధ్య కాలంలో మంచి సినిమాలు అనుకున్న కొన్నింటిని థియేటర్లలో ఉండగా పెద్దగా పట్టించుకోని ప్రేక్షకులు.. ఓటీటీల్లో వచ్చాక వాటిని గొప్పగా ఆదరించిన సందర్భాలున్నాయి. గత ఏడాది ‘పలాస 1978’, ‘రాజావారు రాణి వారు’ లాంటి సినిమాల విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు నాగార్జున చిత్రం ‘వైల్డ్ డాగ్’ విషయంలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.

ఏప్రిల్ 2న రిలీజైన ‘వైల్డ్డ్ డాగ్’కు మంచి టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ చిత్రానికి వసూళ్లు ఏమాత్రం ఆశాజనకంగా రాలేదు. ఓపెనింగ్స్ లేవు. తర్వాత కూడా సినిమా పుంజుకోలేదు. కేవలం రూ.3 కోట్ల షేర్‌తో సరిపెట్టుకుందా సినిమా. నాగార్జున లాంటి పెద్ద హీరో సినిమాకు ఇంత తక్కువ వసూళ్లు రావడం అనూహ్యం. కరోనా కారణమా అనుకుందామంటే తర్వాతి వారంలో వచ్చిన ‘వకీల్ సాబ్’కు వసూళ్ల మోత మోగిపోయింది. మరి ‘వైల్డ్ డాగ్’ ఎందుకు ప్రేక్షకులకు ఆకర్షించలేకపోయిందో ఏమో? కానీ ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌లో రిలీజైతే తెలుగు వాళ్లే కాక వివిధ భాషల వాళ్లు బాగానే చూస్తున్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ఇండియా వైడ్ ట్రెండ్ అవుతోందీ సినిమా. వివిధ భాషల వాళ్లు సినిమా చూసి.. బాగుందని ట్వీట్లు వేస్తున్నారు. మన వాళ్లు కూడా సినిమా చూసి మెచ్చుకుంటూ, ఇది థియేటర్లలో ఎందుకు ఆడలేదని ఆశ్చర్యపోతుండటం గమనార్హం.