‘ఆరెంజ్’ రెమ్యూనరేషన్.. భవిష్యత్తులో ఇస్తాడట


రామ్ చరణ్ తొలి సినిమా ‘చిరుత’ సూపర్ హిట్. రెండో సినిమా ‘మగధీర’ ఇండస్ట్రీ హిట్. ఆ సినిమాతో చరణ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అతడి మూడో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో అప్పటికే తనకు వచ్చిన మాస్ ఇమేజ్‌ను పక్కన పెట్టి ఒక మంచి లవ్ స్టోరీ చేయాలనుకున్నాడు చరణ్. ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’ సినిమాలతో మంచి పేరు సంపాదించిన భాస్కర్ అతణ్ని అప్రోచ్ అయ్యాడు.

క్రేజీగా అనిపించిన ఈ కాంబినేషన్లో సినిమా చేయడానికి చరణ్ బాబాయి నాగబాబు ముందుకొచ్చాడు. ఘన చరిత్ర ఉన్న అంజనా ప్రొడక్షన్స్ బేనర్ మీద సినిమా మొదలుపెట్టాడు. రిలీజ్ ముంగిట ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. హ్యారిస్ జైరాజ్ పాటలు మార్మోగిపోయాయి. సినిమా మీద అంచనాల్ని పెంచేశాయి. కానీ థియేటర్లకు వెళ్లిన జనాలకు మాత్రం నీరసం వచ్చేసింది. కాన్సెప్ట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ తేడా కొట్టడంతో ‘ఆరెంజ్’ ప్రేక్షకులకు రుచించలేదు. చరణ్ శ్రమ నిష్ఫలమైంది.

చరణ్ అప్పుడున్న ఊపులో ఇది మాస్ సినిమా అయితే ఓపెనింగ్స్‌తోనే చాలా వరకు పెట్టుబడి వెనక్కి వచ్చేసేది. కానీ క్లాస్ లవ్ స్టోరీ కావడంతో రెండో రోజు నుంచే థియేటర్లు వెలవెలబోయాయి. సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. దెబ్బకు నాగబాబు రోడ్డు మీదికి వచ్చేసే పరిస్థితి. ఈ సినిమా వల్ల తలెత్తిన నష్టాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడి ఒక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కలిగినట్లు నాగబాబు తర్వాతి రోజుల్లో చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఐతే తర్వాత అన్నయ్య, తమ్ముడు ఆదుకోవడం.. తాను కూడా టీవీ రంగంలోకి వెళ్లి సీరియళ్లు, షోలు చేయడం ద్వారా నిలదొక్కుకోవడం.. సమయానికి కొడుకు వరుణ్ తేజ్ కూడా చేతికి అందిరావడంతో నాగబాబు బాగానే పుంజుకున్నారు. ఇప్పుడీ కథంతా గుర్తు చేసుకోవడానికి కారణం ఏంటంటే.. తాజాగా అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా ‘ఆరెంజ్’ గురించి నాగబాబు మాట్లాడారు. ఆ సినిమాకు సంబంధించి చరణ్‌కు పారితోషకం ఇచ్చారా అని అడిగితే.. ఇవ్వలేదని చెప్పాడు నాగబాబు. ఆ సమయంలో తన అప్పుల్లో సగం అన్నయ్య తీర్చాడని.. తమ్ముడు కళ్యాన్ కూడా ఆదుకున్నాడని.. చరణ్‌కు పెండింగ్ పడ్డ రెమ్యూనరేషన్‌ను భవిష్యత్తులో కచ్చితంగా ఇస్తానని నాగబాబు పేర్కొనడం విశేషం.