దేవిపై ఈ పొగడ్తలకేం కానీ..


త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కు ఒక‌ప్పుడు ఆస్థాన సంగీత ద‌ర్శ‌కుడిగా ఉన్నాడు దేవిశ్రీ ప్ర‌సాద్. జ‌ల్సాతో మొద‌లైన‌ వీరి ప్రయాణం.. ఆ త‌ర్వాత జులాయి, అత్తారింటికి దారేది, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల‌కు కూడా కొన‌సాగింది. ఈ నాలుగు ఆడియోలూ విప‌రీతంగా జ‌నాల‌ను ఆక‌ట్టుకున్నాయి. వీరి కాంబినేష‌న్‌కు మంచి క్రేజ్ వ‌చ్చింది.

కానీ ఏం జ‌రిగిందో ఏమో.. అఆ ద‌గ్గ‌ర్నుంచి దేవితో క‌లిసి ప‌ని చేయ‌ట్లేదు త్రివిక్ర‌మ్. ఆ సినిమాకు మిక్కీ జే మేయ‌ర్‌ను ఎంచుకున్న త్రివిక్ర‌మ్.. త‌ర్వాత అజ్ఞాత వాసికి అనిరుధ్‌తో మ్యూజిక్ చేయించుకున్నాడు. ఆపై వ‌రుస‌గా త‌మ‌న్‌తో వ‌రుస‌గా రెండు సినిమాలు చేశాడు. త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్.. ఎన్టీఆర్‌తో తీయ‌బోతున్న సినిమాకు కూడా త‌మ‌నే సంగీత ద‌ర్శ‌కుడ‌న్న సంగ‌తి తెలిసిందే. చూస్తుంటే దేవి మీద త్రివిక్ర‌మ్ పూర్తిగా న‌మ్మ‌కం కోల్పోయిన‌ట్లే ఉంది. అత‌డితో మ‌ళ్లీ ప‌ని చేసేలాగే క‌నిపించ‌ట్లేదు.

ఐతే దేవి మీద త్రివిక్రమ్‌కు ఇంప్రెషన్ తగ్గిపోయిందని అంతా అనుకుంటుంటే.. ఆయన మాత్రం ‘రంగ్ దె’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ సంగీత దర్శకుడిని ఆకాశానికెత్తేశాడు. దేవి ఏ సందర్భం నుంచైనా పాటను పుట్టించి.. ఆ పాటను సూపర్ హిట్ చేస్తాడని.. అతనొక గొప్ప ఎంటర్టైనర్ అని అన్నాడు త్రివిక్రమ్. క్లాసికల్ బ్యాగ్రౌండ్ ఉండి ఆ సంగీతం మీద కూడా పట్టు ఉన్న దేవి అంటే తనకు కేవలం ఇష్టం మాత్రమే కాదని.. గౌరవం కూడా అని అన్న త్రివిక్రమ్.. మొత్తం మన దేశంలోనే గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఒకడంటూ దేవికి గొప్ప కాంప్లిమెంటే ఇచ్చాడు. ఇలాంటి మరిన్ని మాటలతో దేవి ఉప్పొంగిపోయేలా చేశాడు మాటల మాంత్రికుడు.

ఐతే దేవిని ఇంత పొగిడిన త్రివిక్రమ్.. అతడితో ఎందుకు పని చేయట్లేదనే సందేహం అందరికీ కలిగింది. దేవిని కాదని.. మిక్కీ, అనిరుధ్ లాంటి వాళ్లతో పని చేయడం, ఇప్పుడు వరుసబెట్టి తమన్‌ను ఎంచుకుంటుండటం దేవి అభిమానులకు మింగుడు పడటం లేదు. అందుకే రంగ్ దె ఈవెంట్లో త్రివిక్రమ్ మాటలు చూసి ఈ పొగడ్తలకేం కానీ.. దేవితో పని చేసేదెప్పుడు అని ప్రశ్నిస్తున్నారు.