కొత్త సినిమాలకు ‘పాత’ గండం

గత కొన్నేళ్లలో కొత్త సినిమాల థియేట్రికల్ రన్ ఎంత తగ్గిపోయిందో తెలిసిందే. తొలి వారాంతంలో ఎంత దూకుడు చూపించినా.. వీక్ డేస్‌కు వీక్ అయిపోతుంటాయి. తర్వాతి వీకెండ్లో కొత్త సినిమాలు వస్తే.. ప్రేక్షకులు అటు వైపు మళ్లుతుంటారు. పాత సినిమాలకు కష్టమైపోతుంటుంది. కానీ అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు మాత్రం రెండు, మూడు వారాల్లోనూ జోరు చూపిస్తుంటాయి. కొత్త సినిమాలకు సమస్యగా మారుతుంటాయి.

సంక్రాంతి టైంలో ‘క్రాక్’, ఆ తర్వాత ‘ఉప్పెన’ సినిమాలు ఇలాగే తర్వాతి వారాల్లో వచ్చిన కొత్త సినిమాలకు గండి కొట్టాయి. ముఖ్యంగా ‘ఉప్పెన’ ధాటికి తర్వాతి రెండు మూడు వారాల్లో వచ్చిన సినిమాలన్నీ దెబ్బ తిన్నాయి. ఇప్పుడు ‘జాతిరత్నాలు’ కూడా అలాగే కొత్త సినిమాలను దెబ్బ కొడుతుందేమో అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ సినిమా తొలి వారంలో ఎలా ఆడిందో అందరికీ తెలిసిందే. సంచలన వసూళ్లతో తొలి వారాన్ని పూర్తి చేసుకుందీ చిత్రం.

శుక్రవారం ‘చావు కబురు చల్లగా’, ‘మోసగాళ్ళు’, ‘శశి’ లాంటి మూడు చిత్రాలు బాక్సాఫీస్ పరీక్ష ఎదుర్కోబోతున్నాయి. ఈ చిత్రాల్లో నటించిన ముగ్గురు హీరోలకూ సక్సెస్ చాలా అవసరం. వాళ్లు హిట్లు కొట్టి చాలా కాలం అయిపోయింది. ఈ సినిమాలు ఆడటం వారికి అత్యావశ్యకం. ఐతే ఈ సినిమాలకు ‘జాతిరత్నాలు’ నుంచి ముప్పు పొంచి ఉంది. వీక్ డేస్‌లో కూడా చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డ ఈ చిత్రం నుంచి పోటీని తట్టుకుని నిలబడాలంటే కొత్త సినిమాలకు మంచి టాక్ రావాలి.

నెగెటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రం ఇప్పుడున్న వాషౌట్ అయిపోవడం ఖాయం. మరి ఈ మూడు సినిమాల్లో దేనికెలాంటి టాక్ వస్తుందో చూడాలి. ఇవి మూడు చాలా బాగుంటే తప్ప ‘జాతిరత్నాలు’ జోరు తగ్గకపోవచ్చు. ప్రస్తుతమున్న అంచనాల ప్రకారం అయితే ఈ వారాంతంలో కూడా ‘జాతిరత్నాలు’నే బాక్సాఫీస్ లీడర్ కావచ్చు. దాని వసూళ్లపై కొత్త సినిమాలు ఏమేర ప్రభావం చూపుతాయో చూడాలి.