వుహాన్‌లో షూటింగ్ జరుపుకున్న సంపూ సినిమా!

స్పూఫులు, పేరడీలు చేసుకుంటూ కూడా సూపర్ పాపులర్ కావచ్చని.. ఈ స్టయిల్లో ఓ సినిమా కూడా తీసి హిట్టు కొట్టొచ్చని నిరూపించాడు సంపూర్ణేష్ బాబు. తనకు తాను బర్నింగ్ స్టార్ అని బిరుదు ఇచ్చుకుని ఒకప్పుడు అతను చేసిన హంగామా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంపూను హీరోగా పెట్టి సాయి రాజేష్ (స్క్రీన్ నేమ్ స్టీఫెన్ శంకర్) తీసిన ‘హృదయ కాలేయం’ అప్పట్లో సూపర్ హిట్టయింది.

వీళ్ల కలయికలో గత ఏడాది వచ్చిన ‘కొబ్బరి మట్ట’ కూడా ఉన్నంతలో బాగానే ఆడింది. ఇప్పుడు సంపూనే హీరోగా పెట్టి సాయిరాజేష్ అండ్ టీమ్ ఇంకో సినిమా తీసింది. ఇది ప్రస్తుత కాలానికి సరిగ్గా సూటయ్యే సినిమా కావడం విశేషం. కరోనా నేపథ్యంలో సంపూను హీరోగా పెట్టి సినిమా తీశారు. శనివారం సంపూ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు.

ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. టైటిల్ దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశారు. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ఉన్న సంపూ ఓ గబ్బిలాన్ని పట్టుకుని కూర్చున్నాడు. కరోనా వైరస్‌ పుట్టిన చైనా నగరం వుహాన్‌లోని గబ్బిలాల మార్కెట్లో షూటింగ్ జరుపుకున్న చివరి సినిమా అంటూ పోస్టర్ మీద వేయడం విశేషం.

పోస్టర్ మీద కరోనా వైరస్ నమూనాలు కనిపిస్తుండటం.. వెనుక చైనీయులు, పెద్ద పెద్ద బిల్డింగులు దర్శనమిస్తుండటంతో కరోనాను అంతం చేయడానికి వెళ్లిన రక్షకుడి మీద తీసినట్లుగా ఉందీ చిత్రం. సంపూ సినిమా అంటే ఇలాంటి అతి వ్యవహారాలే ఉంటాయి. వీటితోనే అతను నెట్టుకొస్తున్నాడు. జనాలు కూడా సరదాగానే చూస్తారు అతడి సినిమాల్ని. ఈ సినిమా దర్శకుడి పేరు ‘నోలన్ మౌళి’ కావడం గమనార్హం.

సాయి రాజేష్ తన పేరును స్టీఫెన్ స్పీల్ బర్గ్, శంకర్‌ల నుంచి తీసుకున్నట్లే.. ఇతను క్రిస్టఫర్ నోలన్, రాజమౌళిల పేర్లను కలిపి తన స్క్రీన్ నేమ్ పెట్టుకున్నట్లున్నాడు. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో ఇంకా క్లారిటీ రాకపోయినా.. జులై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి సంపూ కొత్త సినిమా దిగుతుందని పోస్టర్ మీద వేసేయడం విశేషం.