బాలీవుడ్లో ఇంకా భయం పోలేదా?

టాలీవుడ్ బాక్సాఫీస్ ఎప్పుడో రీస్టార్ట్ అయింది. మునుపటి వేగాన్నందుకుంది. ఇంకా చెప్పాలంటే కరోనా కంటే ముందు ఉన్నప్పటికంటే ఇప్పుడు ఎక్కువ సందడి కనిపిస్తోంది టాలీవుడ్ బాక్సాఫీస్‌లో. దేశంలో మరెక్కడా లేని విధంగా వారం వారం కొత్త సినిమాలు పెద్ద ఎత్తున రిలీజవుతున్నాయి. ఈ వారం రాబోతున్న ‘జాతిరత్నాలు’కు బుకింగ్స్ ఏ రేంజిలో జరుగుతున్నాయో తెలిసిందే. ‘శ్రీకారం’ సైతం బాగానే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ మిగతా పరిశ్రమలను మాత్రం ఇంకా కరోనా భయం వీడుతున్నట్లు కనిపించడం లేదు.

తమిళంలో కొంచెం పర్వాలేదు కానీ.. మిగతా భాషల్లో కొత్త సినిమాల సందడి అంతగా కనిపించడం లేదు. థియేటర్లు తెరుచుకుని వంద శాతంతో నడుస్తున్నప్పటికీ పెద్ద సినిమాలు విడుదల చేయట్లేదు. ఇంకా కూడా ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. మోహన్ లాల్ ‘దృశ్యం-2’ను గత నెలలో నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్లో అయితే పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుందో తెలియట్లేదు. అక్కడ థియేటర్లలో కొత్త సినిమాల సందడే కనిపించడం లేదు. అప్పుడప్పుడూ ఓటీటీల్లోనే కొత్త సినిమాలు రిలీజవుతున్నాయి. అక్షయ్ కుమార్ సినిమా ‘సూర్యవంశీ’ని ఏప్రిల్ తొలి వారంలో రిలీజ్ చేయడంతో బాలీవుడ్లో మళ్లీ సందడి మొదలవుతుందని అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే చప్పుడే లేదు. ఆ సినిమా రిలీజ్ గురించి వార్తలే లేవు. వేసవి త్వరలోనే ఆరంభం కాబోతున్నా బాలీవుడ్లో జోష్ కనిపించడం లేదు.

ఈ అనిశ్చితి మధ్య ‘బాగ్ మిల్కా బాగ్’ లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన ఫర్హాన్ అక్తర్-రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా కాంబినేషన్లో తెరకెక్కిన బాక్సింగ్ మూవీ ‘తూఫాన్’ను ఓటీటీలోనే రిలీజ్ చేయాలని నిర్ణయించారు. మే 21న అమేజాన్ ప్రైంలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. మిడ్ సమ్మర్లో ఇలాంటి సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలి కానీ.. ఓటీటీ రిలీజ్‌కు వెళ్లడంలో ఆంతర్యం కనిపించడం లేదు. ముందే ఓటీటీ డీల్ అయి ఉండొచ్చు కానీ.. మన దగ్గర ‘వైల్డ్ డాగ్’కు క్యాన్సిల్ చేసినట్లు డీల్ రద్దు చేసుకుని థియేటర్లకు వెళ్లడానికి స్కోపుంది. కానీ బాలీవుడ్లో స్తబ్దత నెలకొనడంతో ‘తూఫాన్’ టీం ఆ సాహసం చేయలేకపోయినట్లుంది. మరి అక్కడ ఎప్పటికి బాక్సాఫీస్ రీస్టార్ట్ అవుతుందో?