మోతెక్కించేస్తున్న సింగర్


తెలుగు సినిమాల్లో తెలుగు పాటలు పాడటానికి తెలుగు గాయనీ గాయకులు పనికి రారు అన్నట్లుంగా ఉంటుంది మన సినిమాల్లో వ్యవహారం. మన సినిమాల్లో మెజారిటీ పాటలు బయటి సింగర్లే పాడుతుంటారు. కొన్ని పాటలకు భిన్నమైన గాత్రాలు అవసరం పడితే.. పరభాషా సింగర్లను ఆశ్రయించడంలో తప్పు లేదు. కానీ అవసరం ఉన్నా లేకున్నా వేరే ఇండస్ట్రీల నుంచి సింగర్లను రప్పించి పాటలు పాడిస్తుంటారు. ఐతే కాస్త శ్రద్ధ పెట్టి చూస్తే మన దగ్గరే ప్రత్యేకమైన గాత్రాలెన్నో ఉంటాయని, వాళ్లతో పాటు పాడితే మోతెక్కిపోతుందని అప్పుడప్పుడూ రుజువు అవుతూనే ఉంటుంది.

‘ఫిదా’ సినిమాలో వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే పాట యూట్యూబ్‌లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ పాట పాడింది లోకల్ సింగర్ అయిన మధుప్రియ. ఇలా అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే మన సింగర్లే అద్భుతమైన పాటలు అందిస్తారనడానికి తాజా రుజువు.. సత్యవతి రాథోడ్ అలియాస్ మంగ్లీ.

వీ6 ఛానెల్లో ధూమ్ ధామ్ ప్రోగ్రాంతో యాంకర్‌గా పరిచయం అయి ప్రేక్షకుల దృష్టిలో పడ్డ మంగ్లీ.. ముందు తెలంగాణ జానపదాలతో గాయనిగా గుర్తింపు సంపాదించింది. ఆ పాటలు బాగా పాపులర్ అయి ఆమెకు సినిమా అవకాశాలు కూడా తెచ్చిపెట్టాయి. ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాలో టైటిల్ సాంగ్ ఆమెకు పేరు తెచ్చింది. తర్వాత ‘అల వైకుంఠపురములో’లో మంగ్లీ పాడిన రాములో రాములా ఎంత పాపులరో తెలిసిందే. ఆ పాటతో మంగ్లీ పేరు మార్మోగిపోయింది. ఈ జోరులో మరిన్ని ఊపున్న పాటలతో మంగ్లీ దూసుకెళ్లిపోతోంది.

‘క్రాక్’లో మంగ్లీ పాడిన భూమ్ బద్దల్ యూట్యూబ్‌ను షేక్ చేసేసింది. దానికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఇక లేటెస్టుగా మంగ్లీ పాడిన ‘సారంగ దరియా’ గురించైతే చెప్పాల్సిన పని లేదు. ఒక్క రోజులో ఈ పాట లిరికల్ వీడియోకు 20 మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే అదెంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పడు ‘అ అంటే అమలాపురం’ లాంటి పాటలు పాడిన తమిళ సింగర్ మాలతిని పోలిన గాత్రం మంగ్లీది. వరుసగా ఆమె పాటలు సెన్సేషన్ క్రియేట్ చేస్తుండటంతో మంగ్లీ టాలీవుడ్లో బిజీయెస్ట్ సింగర్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.