ప్ర‌భాస్ నెవర్ బిఫోర్ లుక్‌

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ చేసిన సాహో డిజాస్ట‌ర్. ఆ త‌ర్వాత చేసిన రాధేశ్యామ్ మీద అంత‌గా అంచ‌నాల్లేవు. దీంతో ప్ర‌భాస్ స్టార్‌డ‌మ్ ప‌డిపోతోంద‌న్న వ్యాఖ్య‌లు మొద‌ల‌య్యాయి. కానీ ఆ త‌ర్వాత మూడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుల‌తో అంద‌రి దృష్టినీ త‌న వైపు తిప్పుకున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్. వీటిలో ముందుగా ప్ర‌క‌టించి చివ‌ర‌గా మొద‌లు కానున్న సినిమా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోయేదే.

ఈ సినిమా గురించి ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ప్ర‌భాస్ అభిమానులను ఊరిస్తున్నాడు నాగ్ అశ్విన్. త‌న‌ నిర్మాణంలో తెర‌కెక్కిన జాతిర‌త్నాలు సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఇచ్చిన ఓ వీడియో ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా అశ్విన్.. ప్ర‌భాస్‌తో తాను చేయ‌బోయే సినిమా గురించి మాట్లాడాడు.

ఈ సినిమాలో ప్ర‌భాస్‌ను నెవ‌ర్ బిఫోర్ లుక్‌లో చూడొచ్చ‌ని అశ్విన్ చెప్పాడు. ప్ర‌భాస్ పోష్ లుక్‌లో క‌నిపిస్తాడ‌ని కూడా సంకేతాలిచ్చాడు. ప్ర‌భాస్‌తో తాను చేయ‌బోయే చిత్రం అంత‌ర్జాతీయ సినిమాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని రీతిలో ఉంటుంద‌న్నాడు. ఈ సినిమాలో ప్ర‌భాస్‌తో పాటు దీపికా ప‌దుకొనే, అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటి పెద్ద తార‌లు న‌టిస్తున్న‌ప్ప‌టికీ.. వాళ్ల‌ను మించిన ఆక‌ర్ష‌ణ‌లో ఈ సినిమా క‌థ‌లో ఉన్నాయ‌ని అశ్విన్ తెలిపాడు.

ఈ సినిమా షూటింగ్ మొద‌లు కావ‌డంలో ఆల‌స్యం అవుతుండ‌టం గురించి స్పందిస్తే.. తాము ప్రి ప్రొడ‌క్ష‌న్ కోసం ఎక్కువ స‌మ‌యం కేటాయించే అవ‌కాశం ప్ర‌భాస్ క‌ల్పించాడ‌ని చెప్ప‌డం విశేషం. ఈ ఏడాదే ఈ చిత్ర షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశాలున్న‌ట్లు అశ్విన్ తెలిపాడు. అశ్విన్ మామ అశ్వినీద‌త్ వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై దాదాపు రూ.400 కోట్ల బ‌డ్జెట్లో ఈ సినిమాను నిర్మించ‌బోతుండ‌టం విశేషం.