‘నాంది’ నిర్మాత తెలివైన పని

అల్లరి నరేష్‌‌ ముఖంలో చాన్నాళ్ల తర్వాత చిరునవ్వులు చూస్తున్నారు అభిమానులు. ఎప్పుడో 2012లో వచ్చిన ‘సుడిగాడు’ తర్వాత.. ఎనిమిదేళ్ల విరామానంతరం అతడి ఖాతాలో ఓ హిట్టు పడేలా కనిపిస్తోంది. ‘నాంది’ సినిమాకు యావరేజ్ టాక్ రాగా.. బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితమే అందుకునేలా సాగుతోందీ చిత్రం. రెండు రోజుల వ్యవధిలో ఈ చిత్రం రూ.1.2 కోట్ల షేర్ రాబట్టింది. ఈ చిత్ర వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను రూ.2.3 కోట్లకు అమ్మారు నిర్మాత సతీశ్ వేగేశ్న. చూస్తుంటే.. బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టం కాదనే అనిపిస్తోంది.

ఈ వారం విడుదలైన మిగతా రెండు చిత్రాలతో పోలిస్తే ‘నాంది’కి మెరుగైన టాక్ వచ్చింది. ఒకప్పుడు తమనెంతగానో అలరించిన అల్లరి నరేష్‌కు చాలా ఏళ్లుగా హిట్టు లేదే అనే సానుభూతి ప్రేక్షకుల్లో ఉంది. చాన్నాళ్ల తర్వాత అతడి నుంచి ఓ మంచి సినిమా రావడంతో జనాలు థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. పాజిటివ్ టాక్‌ను స్ప్రెడ్ చేస్తున్నారు. బుక్ మై షోలో ఈ చిత్రానికి 93 శాతం పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందంటే ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం ఈ చిత్రానికి స్క్రీన్లు, షోలు కూడా పెరగడం విశేషం.

నిజానికి ఈ సినిమా లాక్ డౌన్ కంటే ముందే దాదాపుగా పూర్తయింది. టీజర్ బాగుండటంతో ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. లాభానికే సినిమాను అమ్ముకునే అవకాశం వచ్చినా.. నరేష్ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి, అతడి మార్కెట్ మళ్లీ పుంజుకోవడానికి అవకాశమిచ్చే సినిమా అని ఆపారు. ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ చేశారు. నిర్మాత అత్యాశకు పోకుండా తక్కువ రేట్లకే సినిమాను అమ్మాడు. దీని వల్ల బ్రేక్ ఈవెన్ పెద్ద కష్టం అయ్యేలా లేదు. బయ్యర్లకు లాభాలు దక్కితే సినిమా ‘హిట్’ స్టేటస్ అందుకుంటుంది. అప్పుడు డిజిటల్, శాటిలైట్ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. మంచి రేట్లు వచ్చే అవకాశముంది. ఈ రకంగా చూస్తే థియేట్రికల్ రిలీజ్ కోసం ఇన్నాళ్లు ఆగి, తక్కువ రేట్లకు సినిమాను ఇవ్వడం ద్వారా నిర్మాత తెలివైన పని చేసినట్లే.