‘కేజీఎఫ్-2’ను ఎగరేసుకుపోయిన దిల్ రాజు?

తెలుగులో ఏ భారీ చిత్రం విడుదలువుతున్నా అందులో దిల్ రాజు భాగస్వామ్యం ఉండటం మామూలే. సొంతంగా సినిమాలు నిర్మించడంతో పాటు.. వేరే వాళ్లు తీసే భారీ చిత్రాలను ఏదో ఒక ఏరియాకు హక్కులు తీసుకుని రిలీజ్ చేస్తుంటాడు రాజు. తన సినిమాలకు పోటీగా వచ్చిన చిత్రాలను కూడా రాజు నైజాం, వైజాగ్ ఏరియాల్లో రిలీజ్ చేసిన సందర్భాలు బోలెడు.

క్రేజ్‌ను బట్టి వేరే భాషల నుంచి వచ్చే భారీ చిత్రాలను సైతం ఆయన కొని తెలుగులో రిలీజ్ చేస్తుంటారు. శంకర్-రజినీకాంత్‌ల భారీ చిత్రం ‘2.0’ను కూడా ఆయన ఇలాగే విడుదల చేశారు. ఏకంగా రూ.72 కోట్లకు ఆ సినిమాను రాజు కొని రిలీజ్ చేయడం విశేషం. ఆ పెట్టుబడి దాదాపుగా రికవర్ అయింది. ఇక ‘2.0’ తర్వాత ఆ స్థాయిలో తెలుగులో క్రేజ్ తెచ్చుకుని దానికి దీటుగా రేటు తెచ్చుకుంటున్న ‘కేజీఎఫ్-2’ మీద కూడా రాజు కళ్లు పడ్డట్లు తాజా సమాచారం.

‘కేజీఎఫ్’ సినిమాను రిలీజ్ చేసిందేమో రాజమౌళి మిత్రుడైన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సాయి కొర్రపాటి. ఆ సినిమాను చాలా బాగా ప్రమోట్ చేసి, పెద్ద ఎత్తున రిలీజ్ చేసి సినిమా విజయవంతం కావడంతో కీలక పాత్ర పోషించారు సాయి. ‘కేజీఎఫ్-2’ కూడా ఆయనకే దక్కుతుందని అంతా అనుకున్నారు. నిర్మాతలు అడిగినంత రేటు కూడా ఇస్తాడనే భావించారు. డీల్ ఓకే అయినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తే దిల్ రాజు ఈ సినిమాను ఎగరేసుకుపోయినట్లు సమాచారం బయటికి వచ్చింది. రూ.65 కోట్లకు ఈ డీల్ తెగిందని, అడ్వాన్స్ పద్ధతిలో ఈ చిత్రాన్ని రాజు రిలీజ్ చేస్తున్నాడని అంటున్నారు.

‘కేజీఎఫ్-2’ మీద ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమా అసాధారణ వసూళ్లు రాబడుతుందని భావించి రాజు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రాజు ద్వారా రిలీజ్ చేస్తే సినిమాకు మరింత రీచ్ పెరుగుతుందన్న ఉద్దేశంతో నిర్మాతలు ఆయనకే హక్కులు ఇచ్చినట్లు సమాచారం. బహుశా సాయి మారు బేరానికి తనకు పట్టున్న సీడెడ్ ఏరియా వరకు హక్కులు తీసుకుని అక్కడ సినిమాను రిలీజ్ చేస్తాడేమో.