చ‌ర‌ణ్‌-శంక‌ర్.. అప్పుడే జాన‌ర్ ర‌చ్చ‌

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ సాలిడ్ ప్రాజెక్టునే సెట్ చేసుకున్నాడు. అతను తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో జత కట్టబోతున్న సంగతి తెలిసిందే. తెలుగులో చిరంజీవి సహా పెద్ద పెద్ద స్టార్లు శంకర్‌తో ఓ సినిమా చేయాలని ఆశపడి నిరాశకు గురైనవాళ్లే. వాళ్లెవ్వరికీ దక్కని అదృష్టం చరణ్‌కు దక్కింది. ఐతే శంకర్ ప్రైమ్ ఫామ్‌లో లేకపోవడం కొంత ప్రతికూలతే అయినా.. ఆయన పనైపోయిందని మాత్రం అనుకోవడానికి లేదు.

‘2.0’తో అంచనాలు అందుకోలేకపోయినా అది తీసిపడేయదగ్గ సినిమా ఏమీ కాదు. అలాగే ‘ఇండియన్-2’తో ఆయన బలంగా పుంజుకుంటాడని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శంకర్‌తో రామ్ చరణ్ మూవీ ప్రేక్షకులను బాగానే ఎగ్జైట్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియక పోయినా.. అనౌన్స్‌మెంట్ అనంతరం దీని గురించి మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

ముఖ్యంగా చరణ్-శంకర్ సినిమా ఏ జానర్‌లో ఉంటుందన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం. శంకర్ సామాజిక, రాజకీయ అంశాలను ముడిపెట్టి కమర్షియల్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. జెంటిల్‌మ్యాన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు ఈ కోవలోని సినిమాలే. చరణ్‌తో తీయబోయేది ఈ తరహా సినిమానే అని.. సమాజంలోని ఒక ప్రధాన సమస్యను తీసుకుని దాన్ని కమర్షియల్ స్టయిల్లో శంకర్ డీల్ చేయబోతున్నాడని ఒక చర్చ నడుస్తోంది.

ఐతే ‘2.0’ పూర్తి చేసిన అనంతరం ఒక నేషనల్ క్రిటిక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఇమ్మీడియట్ ప్రాజెక్టు ‘ఇండియన్-2’ అని చెబుతూ, ఆ తర్వాత ఏ జానర్లో సినిమా తీయబోతున్నది కూడా వెల్లడించాడు. తాను ‘ఇండియన్-2’ తర్వాత సైంటిఫిక్ టచ్ ఉన్న యాక్షన్ థ్రిల్లర్ తీసే అవకాశముందని, అది తనకు ఇష్టమైన జానర్ అని శంకర్ చెప్పాడు. అందుకోసం ఓ స్క్రిప్టు కూడా రెడీ అవుతున్నట్లు వెల్లడించాడు. మరి ఆ స్క్రిప్టుతోనే చరణ్ సినిమా చేయబోతున్నాడా.. లేక ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లు, తన కెరీర్లో ఎక్కువగా తెరకెక్కించిన సోషల్-పొలిటికల్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా తీస్తాడా తీస్తాడా అన్నది ఆసక్తికరం.