గొడవ తేలింది.. మోస్ట్ అవైటెడ్ మూవీ ఆ రోజే

గత ఏడాది మార్చి 24న బాలీవుడ్ బాక్సాఫీస్‌ షేక్ అయిపోతుందని అంతా అనుకున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న అక్షయ్ కుమార్ హీరోగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి రూపొందించిన ‘సూర్యవంశీ’ ఆ రోజే రిలీజ్ కావాల్సింది. అక్షయ్‌కు తోడు అజయ్ దేవగణ్, రణ్వీర్ సింగ్‌లు కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలు చేయడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రిలీజ్ ఇదంటూ హడావుడి జరిగింది.

విడుదలకు అంతా సిద్ధం చేశాక కరోనా మహమ్మారి వచ్చి సినిమాకు బ్రేక్ వేసింది. మళ్లీ ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయా అని ఎదురు చూసి చూసి అలసిపోయింది చిత్ర బృందం. మధ్యలో ఓటీటీ ఆఫర్లు వచ్చినా చిత్ర బృందం స్పందించలేదు. థియేటర్లలో రిలీజ్ చేయడానికే చూసింది. అక్టోబర్లో థియేటర్లు పున:ప్రారంభం అయినా 50 శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ చేయలేక ఆగారు. ఇప్పుడు 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నా సినిమా రిలీజ్ ఊసే వినిపించట్లేదు.

ఇంకెంత కాలం ‘సూర్యవంశీ’ లాంటి క్రేజీ మూవీని ఆపుతారనే ప్రశ్నలు తలెత్తుతుండగా.. ఎట్టకేలకు ఈ చిత్ర విడుదలపై నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. థియేటర్లు పున:ప్రారంభం అయ్యాక కూడా సినిమా ఆలస్యమవుతుండటానికి ఎగ్జిబిటర్లకు, బాలీవుడ్ నిర్మాతలకు మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనే కారణమని తెలుస్తోంది. థియేటర్ల నుంచి వచ్చే రెవెన్యూ విషయంలో ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు వచ్చే వాటాల విషయమై బాలీవుడ్లో గొడవ నడుస్తోంది. ఓవైపు మల్టీప్లెక్సులు ఆదాయంలో వాటాను తగ్గించుకోవాలని నిర్మాతలు అంటుంటే.. సింగిల్ స్క్రీన్ల యజమానులేమో మల్టీప్లెక్సుల తరహాలో తనకు వాటా ఇవ్వాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ కారణంగా అందరూ దెబ్బ తిన్న నేపథ్యంలో ఎవరికి వాళ్లు తమకు ఎక్కువ ప్రయోజనం దక్కేలా ఒప్పందాలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే బాలీవుడ్లో పెద్ద సినిమాలేవీ కరోనా విరామం తర్వాత విడుదల కాలేదు.

ఐతే ఎట్టకేలకు ప్రతిష్ఠంభన వీడిందని, అందరికీ ఆమోదయోగ్యంగా పంపకాలు ఉండేలా ఒక ఒప్పందం జరిగిందని, ఈ నేపథ్యంలోనే ‘సూర్యవంశీ’ని ఏప్రిల్ 2న విడుదల చేయాలని నిర్ణయించారని, మధ్యలో ఏ సినిమాలు విడుదలైనప్పటికీ.. కరోనా బ్రేక్ తర్వాత బాలీవుడ్‌కు అసలైన రీస్టార్ట్ ఈ సినిమాతోనే అని బాలీవుడ్ మీడియా పేర్కొంటోంది. ఇండియాలో 5 వేలకు పైగా థియేటర్లలో నభూతో అన్న రీతిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం.