బెల్లంకొండ.. తొలిసారి ఓ పెద్ద బేనర్లో


బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు కుదిరే కాంబినేషన్లు చూస్తే జనాలకు భలే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అతనేమీ పెద్ద బ్యాగ్రౌండ్ నుంచి రాలేదు. హీరోగా తొలి సినిమాను మినహాయిస్తే మరే చిత్రాన్ని అతడి తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మించలేదు. చాలా వరకు పెద్దగా పేరు లేని బేనర్లలోనే నటించాడు. కానీ ఆ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్లలో తెరకెక్కాయి. పెద్ద పెద్ద దర్శకులు, టెక్నీషియన్లు, నటీనటులతో అతడికి కాంబినేషన్లు కుదిరాయి. ఏమాత్రం రాజీ లేకుండా ఆయా సినిమాలను నిర్మించారు.

శ్రీనివాస్ చివరగా నటించిన ‘అల్లుడు అదుర్స్’ను సైతం పెద్ద బడ్జెట్లో ఓ కొత్త నిర్మాత ప్రొడ్యూస్ చేశాడు. దీని తారాగణం, టెక్నీషియన్ల సంగతి తెలిసిందే. ఐతే ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఏంటంటే సురేష్ తెర వెనుక ఉండి వేరే నిర్మాతల్ని పెట్టి కొడుకుతో సినిమాలు తీయిస్తాడని. ఆ సినిమాలను మార్కెట్ చేయడం, పెద్ద ఎత్తున రిలీజ్ చేయడం, నష్టాలొస్తే డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్ చేయడం అంతా సురేషే చూసుకుంటాడని అంటారు.

ఐతే బెల్లంకొండ శ్రీనివాస్‌‌ను పెద్ద స్టార్ లాగా అతడి సినిమాల్లో ప్రొజెక్ట్ చేయడం చూస్తుంటాం కానీ.. అతడిని ఏ పేరున్న బేనర్ కూడా పిలిచి సినిమా చేసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. ఐతే తొలిసారిగా ఓ పెద్ద సంస్థలో అతను ఓ సినిమా చేయబోతున్నాడన్నది తాజా సమాచారం. ప్రస్తుతం శ్రీనివాస్ దృష్టంతా ‘ఛత్రపతి’ బాలీవుడ్ రీమేక్ మీదే ఉంది. ఈ సినిమా కోసమే ముంబయిలో ఉండి ప్రిపేరవుతున్నాడతను. ఆ సినిమా పూర్తి చేశాక తిరిగి టాలీవుడ్‌కు వచ్చి యువి క్రియేషన్స్ బేనర్లో ఓ సినిమా చేస్తాడట శ్రీనివాస్. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడట.

‘మిర్చి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన యువి క్రియేషన్స్ ఓ వైపు భారీ చిత్రాలను నిర్మిస్తూనే మరోవైపు మీడియం బడ్జెట్లో యువ కథానాయకులతో సినిమాలు తీస్తూ వస్తోంది. ఈ కోవలోనే శ్రీనివాస్ హీరోగా కొత్త దర్శకుడితో తక్కువ బడ్జెట్లో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసిందట. త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన వస్తుందని సమాచారం.