‘ఇండియన్-2’ను వదిలేసిన ఆ టెక్నీషియన్

సుకుమార్ ఆస్థాన టెక్నీషియన్లలో ఒకడు రత్నవేలు. ఇద్దరి ప్రయాణం ‘ఆర్య’ సినిమాతో మొదలైంది. ఆయన సినిమాలకు సంగీత బాధ్యతలు దేవిశ్రీ ప్రసాద్ చూసుకుంటే.. ఛాయాగ్రహణం రత్నవేలు చూసుకుంటాడు. ఐతే కొన్నిసార్లు మాత్రం వేరే కమిట్మెంట్ల వల్ల సుక్కుతో పని చేయలేకపోయాడు రత్నవేలు. చివరగా వీళ్లిద్దరూ కలిసి చేసిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమా అనుకున్న ప్రకారం మొదలై ఉంటే రత్నవేలు ఈ సినిమాకు పని చేసేవాడు.

కానీ ఈలోపే ‘ఇండియన్-2’ కోసం శంకర్ పిలవడం.. ‘పుష్ప’ ఆలస్యం కావడంతో ఈ ప్రాజెక్టుకు దూరం కాక తప్పలేదు. ఐతే ఇంత త్యాగం చేసినందుకు రత్నవేలుకు ఫలితం లేకపోయింది. రెండేళ్ల పాటు రత్నవేలు ఆ సినిమా కోసం సమయం కేటాయించి, సగం సినిమా మాత్రమే పూర్తి చేసి, ఇప్పుడు దాన్నుంచి తప్పుకుని వేరే ప్రాజెక్టులోకి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తినట్లు సమాచారం.

ఎప్పుడో 2018 చివర్లో మొదలైంది ‘ఇండియన్-2’. కానీ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అడ్డంకే. ముందు కమల్‌కు మేకప్ సెట్ కాక, ఆ తర్వాత ఆయన పొలిటికల్ కమిట్మెంట్ల వల్ల, ఆపై సెట్స్‌లో జరిగిన ప్రమాదం వల్ల.. తర్వాత కరోనా కారణంగా.. చివరగా దర్శక నిర్మాతలు, హీరో మధ్య అభిప్రాయ భేదాల వల్ల.. ఇలా రకరకాల కారణాలతో ఆ సినిమా విపరీతంగా ఆలస్యమైంది.

ఐతే ఇంకెంతో కాలం ఈ సినిమా కోసం కేటాయించలేక, ఎంతకీ పున:ప్రారంభం కాని షూటింగ్ కోసం ఎదురు చూడలేక రత్నవేలు ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ‘రోబో’ లాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో తనను భాగం చేశాడన్న గౌరవంతో ఇన్నాళ్లు ఆగిన రత్నవేలు.. ఇక తన వల్ల కాదని ఆ చిత్రానికి గుడ్ బై చెప్పేశాడట. త్వరలో అతను సూర్య సినిమాకు పని చేయనున్నాడట. కొన్ని నెలల ముందే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ఈపాటికి ‘పుష్ప’ కోసం పని చేస్తుండేవాడు రత్నవేలు.