అందరూ చెబుతున్న ఉప్పెన పాయింట్ ఏంటి?

ఉప్పెన.. ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ సినిమా గురించి చర్చలన్నీ. పది నెలల ముందు విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా దెబ్బకు పది నెలలు ఆలస్యంగా ఈ నెల 13న విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. ఒక పెద్దింటి అమ్మాయి, ఒక పేదింటి కుర్రాడు ప్రేమలో పడితే.. అమ్మాయి తండ్రి అడ్డం పడటం.. ఈ క్రమంలో ఆ జంట పడే కష్టాలు.. చివరికి వాళ్లిద్దరి ప్రేమ నిలబడిందా లేదా అనే నేపథ్యంలో సినిమా నడిచేలా కనిపించింది. ఈ కోవలో వందల్లో సినిమాలు వచ్చాయి. కొత్తగా ‘ఉప్పెన’లో ఏం చూపించారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సినిమాలో లవ్ ఫీల్, ఎమోషన్లకు ఢోకా లేనట్లే కనిపించింది, సాంకేతిక ఆకర్షణలు బాగానే తోడైనట్లూ అనిపించింది.

కానీ ఇంకేదో బలమైన పాయింట్ లేకుండా ఈ సినిమాకు చిరు సహా మెగా ఫ్యామిలీ ఆమోద ముద్ర వేసేది కాదు. మైత్రీ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ అంత ఖర్చు పెట్టి సినిమా తీసేది కాదు. సుకుమార్ ఈ ప్రాజెక్టుకు అండగా నిలిచేవాడు కాదు. అన్నింటికీ మించి విజయ్ సేతుపతి లాంటి మేటి నటుడు ఈ సినిమాలో నటించేవాడు కాదు. ఈ నేపథ్యంలో ‘ఉప్పెన’లోని ఆ స్పెషల్ పాయింట్ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఐతే ఇండస్ట్రీలో ఆ పాయింట్ ఏంటన్నది ఆల్రెడీ లీక్ అయినట్లే చెబుతున్నారు. తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో విజయ్ సేతుపతి హీరోకు చేసిన నష్టం ఏంటి అన్నది ఆ పాయింట్ అని సమాచారం.

‘ఉప్పెన’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. ‘డేంజర్ పాయింట్’ అని పేర్కొన్నది దాని గురించి. అలాగే ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగ సైతం ఇన్‌డైరెక్ట్‌గా ఆ పాయింట్ గురించి మాట్లాడాడు. ఇలాంటి ఐడియా తనకెందుకు రాలేదా అనిపించిందన్నాడు. సుకుమార్ సైతం ఆ పాయింట్ గురించి చూచాయిగా చెప్పాడు. సినిమాలో ప్రేక్షకులను ఆ పాయింట్ షాక్‌కు గురి చేస్తుందని, ఒకప్పటితో పోలిస్తే తెలుగు ప్రేక్షకుల అభిరుచి ఎంతో మారి, ప్రయోగాలకు చేయూతనిస్తున్న నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు ధైర్యంగా ఈ పాయింట్‌ను డీల్ చేశాడని, అతడికి అందరూ సపోర్ట్ ఇచ్చారని తెలుస్తోంది.