అనుష్క ఈజ్ బ్యాక్?


తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆ స్థాయి ఇమేజ్ సంపాదించిన కథానాయిక అంటే అనుష్క అనే చెప్పాలి. కెరీర్ ఆరంభంలోనే ‘అరుంధతి’ లాంటి సాహసోపేత, భారీ చిత్రంలో నటించి తిరుగులేని పాపులారిటీ, మంచి మార్కెట్ సంపాదించుకుందామె. ఆ తర్వాత ఆమె నుంచి మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చాయి. మూడేళ్ల కిందట ‘భాగమతి’తో అనుష్క ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. చివరగా ఆమె నుంచి వచ్చిన ‘నిశ్శబ్దం’ సైతం లేడీ ఓరియెంటెడ్ మూవీనే. దానికీ మంచి హైప్ వచ్చింది. కానీ సినిమా ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన తెచ్చుకోలేకపోయింది.

ఈ సినిమా చేయడానికి ముందు, తర్వాత అనుష్క చాలానే గ్యాప్ తీసుకుంది. ఆమెను మళ్లీ స్టార్ హీరోల సరసన గ్లామర్ రోల్స్‌లో చూసే అవకాశాలైతే ఎంతమాత్రం కనిపించడం లేదు.
అదే సమయంలో ‘నిశ్శబ్దం’ ఎఫెక్ట్ కూడా పడి అనుష్క నుంచి కొత్త సినిమా ప్రకటనే లేకపోయింది. ఆమె ఇక రిటైరైపోతుందేమో అన్న వాళ్లూ లేకపోలేదు.

కానీ ఈ ఊహాగానాలకు తెరదించుతూ అనుష్క కొత్త సినిమాను అంగీకరించినట్లు సమాచారం. రమేష్ అనే ఓ కొత్త దర్శకుడితో అనుష్క సినిమా చేయనుందట. ఆమె ఎక్కువగా సినిమాలు చేసినా, తనకు మాతృ సంస్థ అనదగ్గ యువి క్రియేషన్స్‌లోనే ఈ సినిమా తెరకెక్కనుందట. పెద్ద బడ్జెట్లోనే ఈ సినిమా తీస్తారని, త్వరలోనే ప్రకటన ఉండొచ్చని అంటున్నారు.

మరోవైపు అనుష్క.. తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్‌తో ఓ సినిమా చేయొచ్చని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. అనుష్క కోసం ఆయన చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని, ఇద్దరు వేర్వేరు కమిట్మెంట్ల వల్ల కలిసి సినిమా చేయలేకపోతున్నారని, ఈ ఏడాది వీరి కలయికలో సినిమా ఉండొచ్చని కూడా అంటున్నారు.