ఆ సినిమాల డేట్లు కూడా చెప్పేస్తే..

కరోనా బ్రేక్ తర్వాత టాలీవుడ్ దూకుడు మామూలుగా లేదు. షూటింగ్‌లు యమ జోరుగా సాగుతున్నాయి. కొత్త సినిమాల ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. వరుసబెట్టి కొత్త చిత్రాలు రిలీజవుతున్నాయి. అలాగే రాబోయే క్రేజీ సినిమాలకు వరుసబెట్టి డేట్లు ఇచ్చేస్తున్నారు. ఈ నెలలో పదుల సంఖ్యలో కొత్త సినిమాలకు రిలీజ్ డేట్లు ప్రకటించారు.

నిన్న ఒక్క రోజులో ఐదు క్రేజీ సినిమాల డేట్లు ఇవ్వడం విశేషం. గని, పుష్ప, సీటీమార్, ఎఫ్-3, విరాటపర్వం సినిమాల విడుదల తేదీలను గురువారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా విరామం లేకుండా కొత్త సినిమాల డేట్లు ఇచ్చి ప్రేక్షకులకు ఊపిరి సలపనివ్వకుండా చేశారు. ఫిబ్రవరి తొలి వారంతో మొదలుపెడితే.. అక్టోబరులో దసరా వరకు టాలీవుడ్ డైరీ చాలా వరకు ఫిల్ అయిపోయింది. 2021లో మెజారిటీ చిత్రాల డేట్లు ఖరారయ్యాయి కానీ.. అయినప్పటికీ కొన్ని భారీ చిత్రాల రిలీజ్ విషయంలో సస్పెన్స్ నడుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ రిలీజ్ దగ్గర్లోనే ఉందని, వేసవి ఆరంభంలోనే ఈ సినిమా వస్తుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ డేట్ మాత్రం చెప్పడం లేదు. షూటింగ్ ఆరంభ దశలో ఉన్న ‘ఎఫ్-3’కి ఆగస్టులో డేట్ ఇచ్చేసిన రాజు.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘వకీల్ సాబ్’ సంగతి చెప్పట్లేదు. ఏప్రిల్లో రెండో వారాన్ని విడిచిపెట్టి మిగతా వారాలకు సినిమాలు ఖరారైపోయిన నేపథ్యంలో అంతా అనుకుంటున్నట్లే ఆ నెల 9న ఈ చిత్రం విడుదల కావచ్చేమో.

ఆ ప్రకటనేదో చేసేస్తే బాగుండు. ఇక పవన్ అన్నయ్య చిరంజీవి కొత్త సినిమా ‘ఆచార్య’ రిలీజ్ డేట్ విషయంలోనూ సస్పెన్స్ నడుస్తోంది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రిలీజ్ డేట్ అయిన మే 9నే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేస్తారని అంటున్నారు. ఆ క్లారిటీ ఏదో టీజర్లో ఇస్తారేమో చూడాలి. మరోవైపు మహేష్ బాబు కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ విషయంలోనూ రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. కొందరేమో ఆగస్ట్ రిలీజ్ అంటున్నారు. ఇంకొందరేమో అక్టోబరు అంటున్నారు.

మరి చిత్ర బృందం దేనికి ఖరారైందో. ఇంకోవైపు ప్రభాస్ కొత్త సినిమాలు రెండింటి విషయంలోనూ ప్రచారాలు సాగుతున్నాయి. ‘రాధేశ్యామ్’ వేసవికని, ‘సలార్’ వచ్చే సంక్రాంతికి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటి విషయంలోనూ ఆయా చిత్రాల నిర్మాతలు ఒక ప్రకటన చేస్తే ఓ పనైపోతుందేమో.