జానర్ మార్చాడు.. హిట్టొస్తుందా?


రాజ్ తరుణ్ హిట్టు కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ అతడి చివరి హిట్. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ తర్వాత అతడికది హ్యాట్రిక్ హిట్ కావడం విశేషం. ఆపై రాజ్ తరుణ్ పది సినిమాలకు పైగానే చేశాడు. వాటిలో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది. సినిమా సినిమాకూ అతడి స్థాయి, మార్కెట్ పడుతూ వచ్చి.. చివరికి ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా సమయానికి పూర్తిగా కింద పడిపోయాడు.

ఇలాంటి సమయంలో రాజ్ కొత్త చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’ థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీ‌లో రిలీజ్ కావడం అతడికి ఉపశమనమే. ఓటీటీలో కాబట్టి జనాలు ఓ మోస్తరుగా చూశారు. పెద్దగా విషయం లేని ఈ చిత్రం థియేటర్లలో రిలీజై ఉంటే పెద్ద షాక్ తగిలేదే. ‘ఒరేయ్ బుజ్జిగా’ను హిట్‌గా ప్రచారం చేసుకున్న రాజ్ తరుణ్, దాని దర్శకుడు విజయ్ కుమార్ కొండా తమ కలయికలో ఇంకో సినిమా చేయడానికి రెడీ అయిపోయారు.

ఈసారి తమ గత చిత్రానికి భిన్నమైన సినిమానే చేయబోతోంది ఈ జోడీ. ఈ సినిమా పేరు.. పవర్ ప్లే. ఇదొక సీరియస్ థ్రిల్లర్ అనే విషయం, టైటిల్, దాని లోగో, ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. టైటిల్ మీద రక్తపు మరకలున్నాయి. రాజ్ తరుణ్ సీరియస్‌గా గన్ను పట్టుకుని కూర్చుని ఉన్నాడు. పోస్టర్ థీమ్ అంతా కూడా సినిమా చాలా సీరియస్‌గా ఉంటుందని, థ్రిల్లింగ్‌గా సాగుతుందని సంకేతాలు ఇస్తోంది. దేవేష్, మహిధర్ అనే కొత్త నిర్మాతలు వనమాలి క్రియేషన్స్ అనే బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ తరహా సీరియస్ థ్రిల్లర్ చేయడం విజయ్ కుమార్‌కు కొత్త. తొలి రెండు సినిమాలు గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా ప్రేమకథ లవ్ స్టోరీలు కాగా.. మూడోది కామెడీ ఎంటర్టైనర్. ఇలాంటి సినిమాలు తీసిన దర్శకుడు థ్రిల్లర్‌ను ఎలా డీల్ చేస్తాడో చూడాలి. జానర్ మార్చిన రాజ్‌కు ఈ చిత్రంతో అయినా మంచి ఫలితం అందుతుందేమో చూడాలి.