మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో ఇది బ్లాక్ బస్టర్ అనడంలో సందేహం లేదు. కానీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసిన చిత్ర బృందం.. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాను ఇతర భాషల ప్రేక్షకుల్లోకి కూడా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా శనివారం చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టింది. మామూలుగా తన సినిమాలను తెలుగులో కూడా పెద్దగా ప్రమోట్ చేయని రవితేజ ఈ ఈవెంట్కు హాజరయ్యాడు. దర్శకుడు శివ నిర్వాణ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నాడు.
ఇద్దరూ అక్కడ చక్కటి ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా రవితేజ అయితే.. తమిళంలోనే స్పీచ్ ఇచ్చాడు. తమిళ హీరోల్లాగా ఒకట్రెండు ముక్కలు తెలుగులో మాట్లాడినట్లు కాకుండా.. మొత్తంగా తమిళంలోనే ప్రసంగించాడు రవితేజ. చెన్నైతో తనకున్న అనుబంధం గురించి చెబుతూ.. ఇక్కడే హీరో అవుదామని చేసిన ప్రయత్నాల గురించి గుర్తు చేసుకున్నాడు.
ఇరుముడి సినిమా విశేషాలనూ తమిళులకు అర్థమయ్యేలా చెప్పాడు. ఈ సినిమాను ఆదరించాలని కోరాడు. ఐతే మాస్ రాజా తాపత్రయం బాగానే ఉంది కానీ.. మనవాళ్లు ఎంత మంచి సినిమా తీసినా, ఎంతగా ప్రమోట్ చేసినా తమిళంలో కలెక్షన్లు రాబట్టడం కష్టమే. అక్కడ మన సినిమాలకు అసలు థియేటర్లే ఇవ్వరు. ఇరుముడికి కూడా వేళ్ల మీద లెక్కబెట్టేన్ని షోలే ఇచ్చారు.
తమిళ జనాలు కూడా మన సినిమాలు బాగున్నాయన్నా చూడరు. వాళ్లకు వాళ్ల సినిమాలే గొప్ప. తెలుగు దర్శకుడు, నిర్మాత తీశారని.. సూర్య చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ను కూడా సరిగా ఆదరించని మహానుభావులు తమిళ ప్రేక్షకులు. అలాంటిది తెలుగు అనువాదం అయిన ఇరుముడిని వాళ్లు ఎందుకు చూస్తారు? రవితేజ సహా టీం అంతా ఎంత కష్టపడ్డా, డబ్బులు పెట్టుకుని తమిళనాట ప్రమోషన్లు చేసినా.. అక్కడి నుంచి ఆశించిన స్పందన వస్తుందా అన్నది ప్రశ్నార్థకమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates