అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో రూ.800 కోట్లకు పైగా బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మొదట్లో ప్రి విజువలైజేషన్ వీడియో రిలీజ్ చేసినపుడే అందరూ అవాక్కయ్యారు. అట్లీ హాలీవుడ్ లెవెల్లో చాలా పెద్దగా ఏదో ప్లాన్ చేశాడని.. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాడని అప్పుడే అర్థమైంది.
తర్వాత సినిమా టైటిల్, బన్నీ ఫస్ల్ లుక్ తప్ప ఏమీ పంచుకోకపోయినా.. ఈ మూవీ గురించి తెలిసిన వాళ్లు మాట్లాడినపుడల్లా బన్నీ అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. తాజాగా మంచు లక్ష్మీప్రసన్న ‘రాకా’కు ఒక రేంజిలో ఎలివేషన్ ఇచ్చింది. ‘రాకా’లో ప్రేక్షకులు అద్భుతాలు చూడబోతున్నారని ఆమె సంకేతాలు ఇచ్చారు.
కార్లో నుంచి ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న మంచు లక్ష్మి.. ఇప్పుడే తాను ‘రాకా’ సెట్ నుంచి వస్తున్నట్లు వెల్లడించింది. బన్నీ తనను ఎప్పట్నుంచో ‘రాకా’ సెట్ చూసేందుకు పిలుస్తున్నాడని.. ఇప్పుడే ముంబయిలోని ఆ మూవీ సెట్కు వెళ్లి వచ్చానని.. అక్కడ చూసింది తాను నమ్మలేకపోతున్నానంటూ నోరెళ్లబెట్టింది లక్ష్మి. సెట్లో నోరెళ్లబెట్టిన తాను ఇప్పుడు కార్లోనే మూస్తున్నట్లు చెప్పిన లక్ష్మి.. అక్కడ రకరకాల జంతువులున్నట్లు చెప్పింది. ఈ జంతువులన్నీ పాండారా గ్రహం (అవతార్ రెఫరెన్స్) నుంచి తెచ్చారేమో అని ఆమె అంది.
ఈ సినిమా సెట్లో ఎంతోమంది, ఎన్నో విభాగాల వాళ్లు కలిసి పని చేస్తున్నారని.. వీళ్లంతా కలిసి అద్భుతాలను ఆవిష్కరించబోతున్నారని.. ఆ అద్భుత ప్రపంచాన్ని తెర మీద చూసేందుకు తాను ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని మంచు లక్ష్మి చెప్పింది. ‘రాకా’కు ఆమె ఇచ్చిన ఎలివేషన్ చూసి బన్నీ అభిమానులు ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు. అట్లీ ఏం ప్లాన్ చేస్తున్నాడో.. అతడితో కలిసి బన్నీ వెండితెరపై ఎలాంటి అద్భుతాలను ఆవిష్కరిస్తాడో అని ఫ్యాన్స్ ఉత్కంఠకు గురవుతున్నారు. బన్నీ సరసన దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ‘రాకా’ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదలవుతుందని భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates