నో డౌట్.. పవన్‌ పక్కన ఆమే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో ఈ మధ్యే ఓ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్. ఇందులో హీరోలిద్దరికీ జోడీలు కూడా ఉంటాయి. కాకపోతే రానా చేస్తున్న పాత్ర పక్కన నటించాల్సిన అమ్మాయి పాత్రకు ప్రాధాన్యం తక్కువే. కానీ పవన్ సరసన చేయబోయే పాత్ర మాత్రం సినిమాలో కొంచెం కీలకంగానే ఉంటుంది. ఒరిజినల్లో పెద్దగా పేరులేని కొత్త అమ్మాయి ఆ పాత్రను చేసింది.

బిజు మీనన్ పక్కన కాబట్టి ఎవరైనా ఓకే. కానీ తెలుగులో పవన్ కళ్యాణ్ పక్కన అంటే స్టేచర్ ఉన్న హీరోయిన్నే పెట్టాలి. అదే సమయంలో ఆ పాత్రను సమర్థంగా పోషించే నైపుణ్యం ఉన్న నటి కావాలి. ఆ లక్షణాలు సాయిపల్లవిలో ఉన్నాయని భావించి ఆమెనే చిత్ర బృందం సంప్రదించారని కొన్ని రోజుల ముందే వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత దీనిపై చప్పుడు లేకపోయింది.

ఒక దశలో సాయిపల్లవి ఈ సినిమాను తిరస్కరించిందనే ప్రచారం కూడా జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌లో పవన్‌తో జోడీ కట్టడానికి అంగీకరించిందట. ఆమె ఆల్రెడీ అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసేసినట్లు సమాచారం. సినిమాలో నిడివి పరంగా తక్కువే అయినప్పటికీ పాత్ర ఇంపాక్ట్ మాత్రం బాగానే ఉంటుంది. ఈ సినిమా కోసం కెరీర్లోనే అత్యధిక పారితోషకం తీసుకోనుందట సాయిపల్లవి.

విశేషం ఏంటంటే.. ప్రస్తుతం సాయిపల్లవి రానా సరసన ‘విరాటపర్వం’లో నటిస్తోంది. దీని తర్వాత రానా చేయనున్న సినిమాలో పవన్‌కు జోడీగా నటించనుండటం యాదృచ్ఛికమే. ఇంతకుముందు అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలు తీసిన సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ మాటలు రాస్తున్నట్లు చెబుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.