బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు. చిన్న చిన్న కామెడీ పాత్రలతోనే కెరీర్ అంతా నెట్టుకొచ్చాడు. అలాంటి నేపథ్యం ఉన్నవాడు నిర్మాతగా తీసిన సినిమాలు చూసి షాకవ్వని వారు లేరు. జూనియర్ ఎన్టీఆర్తో బాద్షా, టెంపర్.. రామ్ చరణ్తో గోవిందుడు అందరివాడేలే.. అల్లు అర్జున్తో ఇద్దరమ్మాయిలతో లాంటి పెద్ద సినిమాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు బండ్ల.
ఇప్పుడు తన కూతురు జనని పెళ్లి జరిపించిన విధానం.. ఆ వేడుకకు హాజరైన అతిథుల జాబితా చూసి అంతకంటే ఆశ్చర్యం కలుగుతోంది అందరికీ. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ వేడుకకు హాజరయ్యారు. ముఖ్యంగా చంద్రబాబు సతీసమేతంగా హాజరవడమే కాదు.. స్వయంగా తన చేతుల మీదుగా వరుడికి తాళిబొట్టు అందించారు. చంద్రబాబు దంపతులను చూసి బండ్ల తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.
కేటీఆర్, బొత్స సత్యనారాయణ సహా ఇంకా అనేకమంది రాజకీయ నాయకులే కాదు.. ఫిలిం సెలబ్రెటీలు కూడా పెద్ద ఎత్తున ఈ వేడుకలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా వచ్చారు. ఇంకా అక్కినేని నాగార్జున, నాగచైతన్య-శోభిత, గోపీచంద్, శ్రీకాంత్, కిరణ్ అబ్బవరం, బోయపాటి శ్రీను.. ఇలా ఎంతోమంది సినీ ప్రముఖులు పెళ్లి వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఐతే ఈ వేడుకలో బండ్ల గణేష్ దేవుడిలా కొలిచే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనకపోవడం ఒక్కటే లోటు.
పవన్ తీవ్ర జ్వరంతో బాధ పడుతుండడంతో బండ్ల కూతురి పెళ్లికి హాజరు కాలేకపోయారు. పవన్ అనారోగ్యం కారణంగా నిన్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నుంచి కూడా అర్ధంతరంగా వెళ్లిపోవడం తెలిసిందే. ఇంకా కోలుకోకపోవడం, ప్రయాణం చేసే పరిస్థితి లేకపోవడంతో పవన్ తన అభిమాని ఇంటి వేడుకకు రాలేకపోయారు. ఐతే పవన్ లేకపోయినా ఆయన సతీమణి అనా లెజ్నెవా హాజరై జనని, సూర్య జంటకు ఆశీర్వాదం అందించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates