మోహన్ లాల్ వారసురాలి సినిమా మెప్పించిందా  

స్టార్ హీరోల వారసురాళ్లు స్క్రీన్ మీదకు వచ్చి సక్సెస్ కావడం అరుదు. ముఖ్యంగా మన దక్షిణాదిలో ఒక్క కమల్ హాసన్ మాత్రమే ఈ విషయంలో అనుకున్నది సాధించారు. శృతి హాసన్ రూపంలో చెప్పుకోదగ్గ ఆనందాన్ని పొందారు. ఇదే కోవలో ఇటీవలే మోహన్ లాల్ తనయ విస్మయ మోహన్ లాల్ తెరంగేట్రం చేసింది. తుడక్కుమ్ పేరుతో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 6.8 కోట్లు వసూలు చేసి మల్లువుడ్ లో కొత్త లోక పేరు మీదున్న రికార్డుని దాటేసింది.

అంతగా ఇందులో ఏముందనే డౌట్ వస్తోంది కదా. కథలోకి వెళ్తే క్లారిటీ వస్తుంది. మీను అనే అమ్మాయి తండ్రి రవితో కలిసి ఇడుక్కి దగ్గర కొండ ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది. ఒకసారి బ్యాంక్ పరీక్ష రాసి తిరిగి వస్తున్న క్రమంలో ఆమెను ఒక సైకో కిల్లర్ కిడ్నాప్ చేస్తాడు. పోలీసులు వెతుకుతున్న టైంలోనే మీను తిరిగి వస్తుంది. అయితే ఆమెకు తెలియకుండా వెంటటాడిన కిల్లర్ తనతో పాటు రవిని టార్గెట్ చేస్తాడు. ఈ ప్రమాదంలో మీను సెల్ఫ్ డిఫెన్స్ తో తండ్రిని ఎలా కాపాడుకుందనేది అసలు స్టోరీ.

దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ గతంలో కేరళ వరదల బ్యాక్ డ్రాప్ లో 2018 తీసి అవార్డులు, బాక్సాఫీస్ వసూళ్లు రెండూ సాధించారు. ఇప్పుడీ తుడక్కుమ్ అదే కోవలో చేరేలా ఉంది. తొలి గంట నెమ్మదిగా సాగినా సమాజంలో మాములు మనిషిగా ఉన్న వ్యక్తి ఒక సైకో కిల్లర్ గా హీరోయిన్ ని కిడ్నాప్ చేయడం దగ్గర నుంచి కథనం వేగమందుకుంటుంది. మోహన్ లాల్ క్యామియో కూడా బాగానే పేలింది. కఠిన పరిస్థితులు వస్తే అమ్మాయిలు ఎలా వాటిని ఎదురుకొవాలనేది తుడక్కుమ్ లోని ప్రధాన సారాంశం.

తెలుగులో డబ్బింగ్ చేసే ప్రతిపాదన ఉంది కానీ విడుదల విషయంలో స్లాట్లు ఖాళీ లేకపోవడంతో నిర్మాతలు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మోహన్ లాల్ గత ఏడాది తొడరమ్ తో హిట్టు కొడితే ఇప్పుడు విస్మయ తుడక్కుమ్ తో తొలి విజయం ఖాతాలో వేసుకునేలా ఉంది. విలన్ గా నటించిన ఆశిష్ జో ఆంటోనీతో పాటు విస్మయ, మలయాళ నటుడు సాయికుమార్ పెర్ఫార్మన్సులు బలంగా నిలిచాయి. ఒకవేళ డబ్ కాకపోతే రీమేక్ చేసే ఛాన్స్ ఎవరైనా తీసుకుంటారేమో చూడాలి.