దురంధర్ ముందు వరకు నాన్ బాలీవుడ్ రాష్ట్రాల్లో అంతగా పరిచయం లేని పేరు ఆదిత్య ధార్. ఏడు గంటలకు పైగా ఉన్న రెండు భాగాల స్పై డ్రామాతో కేవలం మూడు నెలల గ్యాప్ లో మూడు వేల కోట్లకు పైగా వసూలు చేయడం మాటలు కాదు. అంత చరిత్రను సృష్టించిన ఈ టాలెంటెడ్ దర్శకుడు నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తారనే దాని మీద విపరీతమైన అంచనాలున్నాయి. ప్రభాస్, రామ్ చరణ్, సల్మాన్ అంటూ రకరకాల పేర్లు ముంబై వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏదీ నిర్ధారణ కాలేదు.
తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా వర్మ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవలే ఆదిత్య ధార్ ని కలిసి మహావీరుడు లాచిత్ బోర్ఫుకన్ కథను తెరకెక్కించమని కోరానని, దానికి ఆయన సానుకూలంగా స్పందించాడని అన్నారు. త్వరలోనే రాష్ట్రానికి వస్తానని చెప్పారట. ఇంతకీ లాచిత్ బోర్ఫుకన్ అంటే ఎవరనే సందేహం నెటిజెన్లకు కలుగుతోంది. ఈయన 17 శతాబ్దానికి చెందిన గొప్ప పోరాట యోధుడు. చక్రధ్వజ సింహ రాజ్యంలో సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉండేవారు.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అస్సాంని ఆక్రమించుకోవడానికి రామ్ సింగ్ ని నియమించి యుద్ధానికి పంపిస్తాడు. బ్రహ్మపుత్ర నది ప్రాంతంలో జరిగిన ఈ భీకర పోరులో లాచిత్ బోర్ఫుకన్ తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నప్పటికీ, వెన్ను చూపకుండా తన సైనికుల్లో యెనలేని ధైర్యాన్ని నింపి మొఘల్ సైన్యాన్ని చిత్తుచిత్తుగా ఓడించాడు. ఈయన దేశభక్తి ఏ స్థాయిలో ఉండేదంటే మొఘల్ కుట్రలను భగ్నం చేయడంలో అలసత్వం ప్రదర్శించాడని స్వంత మేనమామ తల నరికేశారు.
ఆ తర్వాత ఒక సంవత్సరానికి 1672లో లాచిత్ బోర్ఫుకన్ అనారోగ్యంతో కన్ను మూశారు. యుద్ధంలో ఆయన్ని ఎవరూ చంపలేకపోయారు. ఈ యోధుడికి నివాళిగా ప్రతి సంవత్సరం అస్సాంలో నవంబర్ 24 లాచిత్ దివస్ నిర్వహిస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ లాచిత్ బోర్ఫుకన్ గోల్డ్ మెడల్ ని వీరులకు బహుకరిస్తుంది. ఇంత గొప్ప హిస్టరీ కలిగిన ఈ వీరుడిని కథను నిజంగా ఆదిత్య ధార్ తెరకెక్కిస్తారా లేదానేది చూడాలి. ఇప్పటికైతే చర్చల దశలోనే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates