టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇంకే నిర్మాత గురించి సామిజిక మాధ్యమల్లో అంత చర్చ జరగదు అంటే అతిశయోక్తి కాదు. ఎవరి మీదైనా పంచ్ వేయడానికి అస్సలు వెనుకాడని నాగవంశీ.. ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కు ధీటుగా సమాధానం చెప్పడం ద్వారా బాలీవుడ్ ప్రముఖులు, మీడియా ప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడం గుర్తుండే ఉంటుంది.
అయినా కూడా అతనేమీ చలించలేదు. అలాంటి వ్యక్తి.. తనను ఉద్దేశించి ఎగ్జిబిటర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినా సైలెంటుగా ఉండడం చర్చనీయాంశమైంది. ఇటీవల సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ పద్ధతిని అమలు చేసే విషయమై ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య తకరారు నడిచిన సమయంలో సునీల్ నారంగ్ను ఉద్దేశించి నాగవంశీ ఏదో అంటే.. దానికి బదులుగా నాగవంశీ పేరెత్తకుండా విగ్గు అంటూ నారంగ్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారి తీసింది.
దీని గురించి ఒక ఇంటర్వ్యూలో అడిగితే నాగవంశీ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. మిమ్మల్ని అలా టార్గెట్ చేసినా సైలెంటుగా ఉండిపోయారేంటి, అది మీ స్వభావం కాదు కదా అని అడిగితే.. తాను వెంటనే ఒక మాట అని ఆ వ్యక్తి కుటుంబాన్ని బాధ పెట్టడం ఎందుకు అని ఆగిపోయినట్లు నాగవంశీ తెలిపాడు. అలా అని తాను పూర్తిగా సైలెంటుగా ఉండే రకం కాదని.. దానికి రివెంజ్ ఉంటుందని నాగవంశీ హింట్ ఇచ్చాడు.
నారంగ్ పేరెత్తకుండా ఆయనకు బాగా డబ్బులున్నాయని.. ఆయన్ని మనమేమీ చేయలేమని.. కానీ తన దగ్గర కంటెంట్ ఉందని.. ఆ కంటెంట్తో ఏం చేయాలో అది చేస్తామని.. తిరిగి దెబ్బ కొడతామని నాగవంశీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఐతే నైజాం ఏరియాలో అత్యధిక థియేటర్లు ఉన్న సునీల్ నారంగ్ను కంటెంట్తో దెబ్బ కొట్టడం అంటే నాగవంశీ ప్లానేమిటో మరి?
Gulte Telugu Telugu Political and Movie News Updates
