‘ఇడుపు కాయితం’ మీద ఇంత చర్చా

నిన్న సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ నిర్మాణంలో ఇడుపు కాయితం అనే కొత్త సినిమా ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. లోకేష్ కనగరాజ్ ముఖ్యఅతిథిగా విచ్చేయగా చాలా మంది టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు ఆకర్షణగా నిలిచారు. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ ఎంటర్ టైనర్ కు సుక్కు శిష్యుడు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. కాన్సెప్ట్ లాంచ్ చాలా వెరైటీగా ప్లాన్ చేసి ఆకట్టుకున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ టైటిల్ మీద రచ్చ మొదలయ్యింది.

సోషల్ మీడియాలో ఈ ఇడుపు కాయితం మీద కొత్త డిస్కషన్ లేవనెత్తారు. అర్థం కానట్టు ఇలాంటి పేరు పెట్టారేమిటంటూ ఒకరు, ఒక ప్రాంతానికే పరిమితమయ్యేలా పాత మాండలికం పెట్టారంటూ మరొకరు, ఇలా రకరకాలుగా దాని గురించి ట్వీట్స్ చేయడం ఆరంభించారు. ఇడుపు కాయితం అంటే అనధికార విడాకులు. తెలంగాణలో ఈ పద్దతి కొన్ని వర్గాల్లో ఉండేది. కోర్టు దాకా వెళ్లకుండా భార్యా భర్తలు పరస్పర అంగీకారంతో విడిపోయే పద్దతి దశాబ్దాల క్రితంది. కాకపోతే పాటింపులో లేదు.

అయినా దీని మీద ఇంత అభ్యంతర పెట్టేందుకు ఏముందో అంతు చిక్కని విషయం. ఇడుపు కాయితంని విమర్శించడం కానీ ఎగతాళి చేయడం కానీ సినిమాలో చేసి ఉండరు. అలాంటిది ఏదైనా ఉంటే కనీసం ట్రైలర్ వచ్చేదాకా అయినా ఆగాలి. అంతే కానీ ఒక పోస్టర్ ని ఆధారంగా చేసుకుని చర్చ లేవనెత్తడం సబబు కాదు. అయినా ఇది ఒకందుకు మంచిదే. షూటింగ్ స్టార్ట్ అయిన రోజే మూవీ గురించి పది మందికి తెలుస్తుంది. ఆ రకంగా ప్లస్ అనే అనుకోవాలి.

బలగం, కోర్ట్ తరహాలో ప్రియదర్శికి ఇది మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం టీమ్ లో ఉంది. తను ఈ మధ్య వరస ఫ్లాపుల్లో ఉన్నాడు. సుయోధన లాంటివి కనీసం జనం దృష్టిలో పడకుండానే థియేటర్ల నుంచి మాయమైపోయాయి. అందుకే ఈసారి జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నాడని తెలిసింది. ఇక హీరోయిన్ నాగదుర్గ గురించి బన్నీ వాస్ చాలా ప్రత్యేకంగా చెప్పారంటే నమ్మకం పెట్టుకోవచ్చు. మొత్తానికి ఇడుపు కాయితం మీద బాగానే ఫోకస్ పడ్డట్టు అయ్యింది.