నిర్మాతకు 15 కండిషన్లు పెట్టిన కొత్త హీరోయిన్

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా కథానాయికలనే పెట్టుకుంటూ ఉంటారు. అందుకు రకరకాల కారణాలున్నాయి. ఐతే సుకుమార్, బన్నీ వాసుల నిర్మాణంలో రూపొందనున్న కొత్త చిత్రంలో మాత్రం అచ్చ తెలుగు అమ్మాయినే కథానాయికగా తీసుకున్నారు. ఆమే.. నాగదుర్గ.

ప్రియదర్శి హీరోగా వేణు రెడ్డి అనే కొత్త దర్శకుడు రూపొందించబోయే ‘ఇడుపు కాయితం’ చిత్రం కోసం ఆమెను హీరోయిన్‌ను ఎంచుకున్నారు. ఐతే ఇది ఆమెకు తొలి సినిమానే కానీ.. తనేమీ జనాలకు తెలియని అమ్మాయి కాదు. తెలంగాణ జానపద గీతాలతో యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసి భారీగా ఫాలోయింగ్ సంపాదించింది నాగదుర్గ. ఐతే తొలిసారి సినిమాలో నటించే అవకాశం వచ్చింది కదా అని ఆమేమీ ఎగిరి గంతేసి వెంటనే ఈ సినిమా ఒప్పేసుకోలేదట.

పిలిచి సినిమా ఛాన్స్ ఇస్తుంటే.. తనకు నాగదుర్గ ఏకంగా 15 కండిషన్లు పెట్టిందని నిర్మాత బన్నీ వాసు ‘ఇడుపు కాయితం’ ఓపెనింగ్ సందర్భంగా చెప్పడం విశేషం. ఒక కొత్త హీరోయిన్ తనకు ఇన్ని కండిషన్లు పెట్టడం ఏంటని ముందు ఆశ్చర్యపోయానని.. కానీ ఆమె తెలుగమ్మాయి అనే విషయం గ్రహించి, ఒక సినిమా చేయాలంటే తెలుగు హీరోయిన్లు ఎంత స్పష్టతతో ఉంటారు అనే విషయం అర్థం చేసుకున్నానని.. సినిమా ఛాన్స్ అని ఎగ్జైట్ అవ్వకుండా ఈ కండిషన్లకు ఒప్పుకుంటేనే నటిస్తా అని చెప్పిన నాగదుర్గ మీద తనకు గౌరవభావం కలిగిందని బన్నీ వాసు వ్యాఖ్యానించాడు.

ఇప్పటికే యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నాగదుర్గ.. సిల్వర్ స్క్రీన్లోనూ చించేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఎమోషనల్‌గా సాగే ఈ సినిమాలో కథ ప్రకారం డ్యాన్స్ నంబర్స్ లేకపోయినా.. నాగదుర్గకు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని 40 సెకన్ల డ్యాన్స్ బిట్ రెడీ చేయిస్తున్నామని బన్నీ వాసు, దర్శకుడు చెప్పడం విశేషం.