నవీన్ పొలిశెట్టి… 5500 కోట్ల ఫ్రేమ్

నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి తెలిసిందే. అతడి సినిమాలు చూస్తే అది అతడికి వంద శాతం అర్హమైన టైటిలే అని ఎవ్వరైనా ఒప్పుకుంటారు. జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, అనగనగా ఒక రాజు.. ఈ చిత్రాల్లో ఎందులో అయినా నవీన్‌ అనేవాడు లేకుంటే అవి అంత పెద్ద హిట్లు అయ్యేవి కావన్నది స్పష్టం.

తనదైన శైలిలో వినోదం పంచుతూ ఆయా చిత్రాలను వేరే లెవెల్‌కు తీసుకెళ్లిన ఘనత నవీన్‌దే. ఐతే నవీన్ ఎంటర్టైన్మెంట్ కేవలం సినిమాలకు పరిమితం కాదు. బయట కూడా అతను అదే స్థాయిలో వినోదాన్ని పంచుతాడు. ఏదైనా ఈవెంట్‌కు హాజరైనా.. సినిమా ప్రమోషన్లు చేసినా.. తనదైన శైలిలో ఎంటర్టైన్ చేస్తుంటాడు. ‘అనగనగా ఒక రాజు’ తర్వాత ఇంకా తన కొత్త సినిమా అప్‌డేట్ ఇవ్వని నవీన్.. తాజాగా ఒక వీడియోను ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశాడు.

తన జీవితంలో కాస్ట్లీయెస్ట్ ఫ్రేమ్ అంటూ.. ఈ వీడియోలో కొందరు ఫిలిం మేకర్స్‌ను చూపించాడు. అందులో ఒక్కొక్కరిని చూపిస్తూ వాళ్ల పేర్లు చెప్పకుండా వారి సినిమాలు సాధించిన వసూళ్ల వివరాలను చెప్పుకొచ్చాడు నవీన్. ముందుగా ‘కూలీ’ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌ను చూపించి 500 కోట్లు అన్న నవీన్.. తర్వాత ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టికి 800 కోట్ల ట్యాగ్ ఇచ్చాడు. ఆపై నవీన్ ఎర్నేనిని 2 వేల కోట్ల నిర్మాత అంటూ చూపించి… సుకుమార్‌ను కూడా 2 వేల కోట్ల దర్శకుడిగా పేర్కొన్నాడు.

ఇలా నంబర్స్ చెబుతుండడంతో ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నవ్వు ఆపుకోలేక వెనక్కి తిరిగేశాడు. ఈ ఫ్రేమ్‌లో దర్శకుడు హరీష్ శంకర్ సైతం ఉన్నాడు. వీళ్లందరినీ కలిపి మొత్తంగా రూ.5500 కోట్ల ఫ్రేమ్ ఇదని నవీన్ పేర్కొనడంతో అందరూ గొల్లుమన్నారు. వీక్షకులకు కూడా ఈ వీడియో ఫుల్ ఫన్ పంచుతోంది. ఈ వీడియో పోస్ట్ చేస్తూ.. తన కొత్త సినిమా అప్‌డేట్ త్వరలో ఇస్తానని నవీన్ చెప్పడం విశేషం.