డైరెక్టర్ల మార్పుపై ఓపెన్ అయిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు రూపొందించే చిత్రంలో రజినీ కథానాయకుడిగా నటించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘ధర్మన్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. సినిమా అనౌన్స్‌మెంట్ రోజే ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తూ ప్రెస్ మీట్ కూడా పెట్టింది చిత్ర బృందం.

కమల్ ప్రొడక్షన్లో రజినీ సినిమా విషయంలో ఇన్నాళ్లూ విపరీతమైన సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో మీడియాకు, అభిమానులకు ఫుల్ క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే టీం ఇలా ప్లాన్ చేసిందన్నది స్పష్టం. ఈ సినిమాకు ముందు సుందర్.సిని, ఆ తర్వాత శిబి చక్రవర్తిని దర్శకులుగా అనుకున్న సంగతి తెలిసిందే. కానీ అనూహ్యంగా ఆ ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు తప్పుకున్నారు. సుందర్ అధికారిక ప్రకటనతోనే ఈ ప్రాజెక్టుకు దూరం కాగా.. శిబి విషయంలో స్పష్టత కొరవడింది.

ఐతే ఈ ఇద్దరు తప్పుకోవడానికి కారణాలేంటో రజినీనే స్వయంగా వెల్లడించారు. అంతే కాక ఈ ఇద్దరి కంటే ముందు మరో దర్శకుడు కూడా ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగారంటూ షాకింగ్ విషయం చెప్పారు రజినీ. సూపర్ స్టార్‌తో పడయప్పా లాంటి ఇండస్ట్రీ హిట్ తీసిన సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌ను ముందు ఈ చిత్రానికి దర్శకుడిగా అనుకున్నారట. కానీ ఆయనకు కథ సెట్ కాక ఈ సినిమా నుంచి తప్పకున్నారట.

తర్వాత సుందర్‌‌ను ఎంచుకున్నామని.. కానీ ఆయనకు వేరే కమిట్మెంట్ ఉండడం వల్ల తనతో చేసే సినిమా వల్ల ఆలస్యం అవుతుందేమో అని ఆయన తప్పుకున్నారని రజినీ వెల్లడించారు.

ఇక శిబి విషయానికి వస్తే అతను మంచి కథ రెడీ చేశాడని.. అందులో హీరోది న్యూక్లియర్ సైంటిస్ట్ క్యారెక్టర్ అని.. ఎన్నో దేశాల్లో చిత్రీకరణ జరపాలని.. చాలా టైం తీసుకునే సబ్జెక్ట్ అని.. పైగా సెన్సిటివ్ స్టోరీ కావడంతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని.. అందుకే ఇప్పుడది వద్దు అని దాన్ని పక్కన పెట్టామని రజినీ తెలిపారు. చివరగా అశ్వత్ మారిముత్తు కథ అన్ని రకాలుగా ఓకే అనిపించి ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్తున్నట్లు రజినీ వెల్లడించారు.