పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో పాటుగా అన్ని ఈవెంట్లలో పాల్గొంది. దూరంతో సంబంధం లేకుండా రామ్ చరణ్ తో సమానంగా ట్రావెల్ చేసి ప్రతి చోటా హైలైట్ అయ్యింది. ఇంటర్వ్యూలలో అచ్చియమ్మ పాత్ర గురించి గొప్పగా చెప్పుకుంది. తీరా చూస్తే విడుదలయ్యాక వచ్చిన మొదటి నెగటివ్ కామెంట్ తన క్యారెక్టర్ గురించే. అది చిలికి చిలికి గాలివానగా మారి దుమారం రేపింది.
దెబ్బకు సైలెంట్ అయిపోయిన జాన్వీ కపూర్ రెండు వారాలు సోషల్ మీడియాకు దూరంగా ఉంది. ఒకరిద్దరు మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూల కోసం ప్రయత్నాలు చేసినా ఒప్పుకోలేదు. ట్వీట్లు పెట్టలేదు. ఇన్స్ టాలో కనిపించలేదు. మొత్తంగా ఆన్ లైన్ ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళిపోయి తాజాగా వెనక్కు వచ్చింది. తన పర్సనల్ ఫోటోలు, మెమరీలు షేర్ చేసుకుంది తప్ప పెద్ది గురించి కానీ కొత్త ఫుటేజ్ గురించి కానీ ఎక్కడా ప్రస్తావన తేలేదు.
శ్రీదేవి వారసురాలిగా సామాన్య ప్రేక్షకుల్లో జాన్వీ మీద మంచి అంచనాలు ఉన్నాయి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే తను చేస్తున్న తెలుగు సినిమాల్లో ఇతర అంశాలు హైలైట్ అవుతున్నాయి. దేవరలో జూనియర్ ఎన్టీఆర్, అనిరుద్ రవిచందర్ క్రెడిట్ తీసుకుంటే జాన్వీ అసలు ఉందా లేదానేలా సెకండాఫ్ కు పరిమితమయ్యింది. పెద్దిలో మొదటి సగం కొంచెం హడావిడి చేసినా రెండో సగం ఐటెం సాంగ్ తర్వాత మళ్ళీ కనిపిస్తే ఒట్టు. ఇదీ మైనస్ అయిపోయింది.
నెక్స్ట్ టాలీవుడ్ నుంచి వచ్చే ఏ ఆఫర్ అయినా సరే బోనీ కపూర్ స్వయంగా ఒకటికి రెండుసార్లు స్క్రిప్ట్ చెక్ చేసుకుని ఓకే చేస్తారని ముంబై వర్గాల సమాచారం. అల్లు అర్జున్ రాకాలో కూడా జాన్వీ ఉంది. మెయిన్ హీరోయిన్ దీపికా పదుకునే అయినప్పుడు జూనియర్ శ్రీదేవికి ఎంత స్కోప్ దక్కుతుందనేది వేచి చూడాలి. ఇప్పటికైతే రాకా బృందం అఫీషియల్ గా జాన్వీ కపూర్ ఉందని ప్రకటించలేదు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అసలు చేస్తుందో లేదో కూడా ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates