ప‌వ‌న్ డేట్లు వేస్ట్!

2024 ఎన్నిక‌ల‌కు ముందు ఒక రెండేళ్లు సినిమాల కోసం కేటాయించి.. సాధ్య‌మైన‌న్ని ఎక్కువ చిత్రాలు చేసేయ్యాల‌ని ప్ర‌ణాళిక ర‌చించుకున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అయితే ఆయ‌న ప్ర‌ణాళిక‌లు అనుకున్న‌ట్లుగా న‌డ‌వ‌ట్లేదు. క‌రోనా వ‌చ్చి ప‌వ‌న్ విలువైన స‌మ‌యాన్ని చాలానే హ‌రించేసింది. ఏడెనిమిది నెల‌ల పాటు ప‌వ‌న్ ఖాళీగా ఉండిపోయాడు.

క‌రోనా లేకుంటే ఈ స‌మ‌యంలో వ‌కీల్ సాబ్‌తో పాటు క్రిష్ సినిమాను కూడా పూర్తి చేసి హ‌రీష్ శంకర్ సినిమాను మొద‌లుపెట్టేసేవాడేమో. కానీ కరోనా బ్రేక్ వ‌ల్ల‌ ఇప్ప‌టికి వ‌కీల్ సాబ్ మాత్ర‌మే పూర్తి చేయ‌గ‌లిగాడు. దాని ప‌ని పూర్త‌వ్వ‌గానే కొత్త ఏడాదిలో క్రిష్ సినిమాను ముందుగా ప‌ట్టాలెక్కించాల‌నుకున్నాడు. కొన్ని రోజులు ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొని త‌ర్వాత అయ్య‌ప్పనుం కోషీయుంను కూడా మొద‌లుపెట్టి స‌మాంత‌రంగా ఈ రెండు చిత్రాల షూటింగ్‌కు హాజ‌ర‌వ్వ‌ల‌నుకున్నాడు.

కానీ ఇంత‌లో క్రిష్ క‌రోనా బారిన ప‌డ‌టంతో పవ‌న్ ప్లాన్ మ‌ళ్లీ మార్చుకోవాల్సి వ‌స్తోంది. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించిన నేప‌థ్యంలో ప‌రీక్ష‌లు చేయించుకోగా క్రిష్ పాజిటివ్ అని తేలింది. దీంతో రెండు మూడు వారాలు క్వారంటైన్లో ఉండాల్పిన ప‌రిస్థితి త‌లెత్తింది. దీంతో ఈ నెల‌లో క్రిష్ సినిమా కోసం ప‌వ‌న్ కేటాయించిన డేట్లు వృథా అయిపోతున్నాయి.

అయ్య‌ప్ప‌నుం కోషీయుం రీమేక్ తొలి షెడ్యూల్‌ను కొంచెం ముందుకు జ‌రిపి షూట్ చేయ‌గ‌లిగితే ప‌వ‌న్ డేట్ల‌ను స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చు. కానీ త‌క్కువ వ్య‌వ‌ధిలో అలా చేయ‌గ‌ల‌రా అన్న‌ది చూడాలి. వ‌చ్చే ఆరేడు నెల‌ల్లో ఈ రెండు చిత్రాల‌నూ పూర్తి చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడు. త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ సినిమాను కూడా ఈ ఏడాదే ప‌ట్టాలెక్కించాల‌నుకున్నాడు. దాని త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డి సినిమా కూడా లైన్లో ఉన్న సంగ‌తి తెలిసిందే.