వ‌డ్డే న‌వీన్ అంత ప‌వ‌ర్ ఫుల్లా?

90వ ద‌శ‌కంలో మ‌న‌సిచ్చి చూడు.. చాలాబాగుంది స‌హా ప‌లు ఫ్యామిలీ సినిమాల‌తో ఆక‌ట్టుకున్న న‌టుడు వ‌డ్డే నవీన్. జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌ల త‌ర్వాత కుటుంబ ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు సంపాదించిన న‌టుల్లో అత‌నొక‌డు. సీనియ‌ర్ నిర్మాత వ‌డ్డే ర‌మేష్ త‌న‌యుడైన న‌వీన్.. న‌టుడిగా ఓ ప‌దేళ్లు మంచి ఫాంలోనే ఉన్నాడు. కానీ 2000 త‌ర్వాత యువ క‌థానాయ‌కుల జోరులో అత‌ను నిల‌వ‌లేక‌పోయాడు.

చివ‌ర‌గా రామ్ గోపాల్ వ‌ర్మ ఎటాక్ మూవీలో న‌టించాక క‌నిపించ‌కుండా పోయిన న‌వీన్.. ఇప్పుడు హీరోగా ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. వ‌చ్చే శుక్ర‌వారం ఈ చిత్రం విడుద‌ల కానున్న నేప‌థ్యంలో తాజాగా నిర్వ‌హించిన ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌కు స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ముఖ్య అతిథిగా హాజ‌రై.. వ‌డ్డే న‌వీన్‌తో త‌న అనుబంధం గురించి ఆస‌క్తిక‌ర విష‌జ్ఞాలు పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా న‌వీన్ ఎంత ప‌వ‌ర్ ఫుల్లో వినాయ‌క్ ఒక ఉదాహ‌ర‌ణ చెప్పాడు.

వ‌డ్డే న‌వీన్ న‌టించిన ఒక సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన విష‌యం ఈ ఈవెంట్లో గుర్తు చేసుకున్నాడు వినాయ‌క్. ఆ సినిమా షూట్ పూర్తి చేసుకుని ఇండియాకు వ‌స్తుంటే.. టీంలో కాస్ట్యూమ‌ర్ ఒక‌రు విమానంలో సిగ‌రెట్ కాల్చార‌ట‌. అది భ‌ద్ర‌త సిబ్బందికి తెలిసి, చెన్నైలో అడుగు పెట్ట‌గానే ఆ కాస్ట్యూమ‌ర్‌ను అరెస్ట్ చేశార‌ట‌.

ఈ విష‌యం వ‌డ్డే న‌వీన్ దృష్టికి వెళ్ల‌గా.. ఆయ‌న ఒక కాల్ చేసి నిమిషాల్లో ఆ కాస్ట్యూమ‌ర్‌ను విడిపించాడ‌ని.. అప్పుడు ఈయ‌న అంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నోడా, ఇంత ప‌వ‌ర్ ఫుల్లా అని ఆశ్చ‌ర్య‌పోయాన‌ని వినాయ‌క్ వ్యాఖ్యానించాడు. ఇక తాను ఆది సినిమాతో ద‌ర్శ‌కుడిగా మార‌డానికి పునాది ప‌డింది కూడా వ‌డ్డే న‌వీన్ సినిమాతోనే అని వినాయ‌క్ వెల్ల‌డించాడు.

బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో వ‌డ్డే న‌వీన్ హీరోగా న‌టించి సినిమా త‌న‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చివ‌రిద‌ని.. ఆ సినిమా చేస్తున్న‌ స‌మ‌యంలోనే జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను స్విట్జ‌ర్లాండ్లో క‌లిశాన‌ని.. ఆ త‌ర్వాతే సురేష్ నిర్మాణంలో ఆది సినిమా మొద‌లైంద‌ని వినాయ‌క్ వెల్ల‌డించాడు.