మంచి సినిమా అంటే బూతులా మారిపోయిన రోజులివి. జనానికి సందేశం అందించే.. సమాజంలోని కఠోర వాస్తవాలను, ప్రమాదకర అంశాలను నిక్కచ్చిగా తెరపై చూపించే సినిమాలు క్రమక్రమంగా బాాగా తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ జనాలను మేల్కొలిపేలా, సిన్సియర్గా సినిమాలు తీసే ఫిలిం మేకర్స్ అప్పుడప్పుడూ తెరపైకి వస్తుంటారు. ‘ది ఇండియా స్టోరీ’ అనే హిందీ సినిమాతో దర్శక నిర్మాతలు అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తోంది.
‘ది ఇండియా స్టోరీ’ అనే టైటిల్ పెడితే.. కశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ తరహాలోనే ఇది కూడా ఒక రకం సినిమా అనుకున్నారు చాలామంది. కానీ దీని వ్యవహారం వేరని తాజాగా లాంచ్ చేసిన టీజర్ చూస్తే అర్థమవుతుంది. దేశంలో అతి పెద్ద సమస్యల్లో ఒకటైన ఆహార కల్తీ మీద సినిమా తీసింది ‘ది ఇండియా స్టోరీ’ టీమ్. షాకింగ్ ట్రూత్ అంటూ.. మనం ఆహారాన్ని కాదు, విషాన్ని తయారు చేస్తున్నాం అంటూ విస్మయపరిచే డేటాను టీజర్లో బయటపెట్టింది టీం.
పాలు సహా మనం తినే ప్రతి ఆహారాన్నీ ఎలా కల్తీ చేస్తున్నారో అనేక పరిశోధనల ఆధారంగా వెల్లడైన డేటాను ఈ టీజర్లో షేర్ చేశారు. కల్తీ, రసాయనాల ప్రభావం వల్ల 20 కోట్ల మంది బాధితులవుతున్నారని.. ప్రతి మూడు కుటుంబాల్లో ఒకటి క్యాన్సర్ బారిన పడుతోందని.. ప్రతి నిమిషానికీ ఒకరిద్దరు చనిపోతున్నారని.. ఇలా ఎన్నో షాకింగ్ ఫ్యాక్ట్స్ను ఈ టీజర్లో షేర్ చేశారు. టీజర్ చూస్తుంటే మనం ఎలాంటి జీవన పరిస్థితుల్లో ఉన్నాామో అని భయం పుడుతుందనడంలో సందేహం లేదు.
ఐతే ఇలాంటి కథాంశంతో డాక్యుమెంటరీలు తీయడం మామూలే కానీ.. ఫీచర్ ఫిలిం తీయడమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పాడే లీడ్ రోల్స్ చేశారు. ఇలాంటి సినిమా తీస్తున్నందుకు కాజల్ అండ్ టీంను అభినందించాల్సిందే. సాగర్ షిండే ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు. చేట్టన్ దర్శకత్వం వహించాడు. జులై 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates