మండిపోతున్న షారుఖ్ అభిమానులు

తమ ఆరాధ్య కథానాయకుడి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుంటే అభిమానులు పడే బాధే వేరు. దీనికి తోడు ఆ హీరో రెండేళ్లకు పైగా విరామం తీసుకుంటే.. ఎంతకీ కొత్త సినిమాను అనౌన్స్ చేయకపోతే అభిమానులు తట్టుకోలేరు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అభిమానుల పరిస్థితి ఇలాగే ఉందిప్పుడు. అతను చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా జనాలకు గుర్తు లేదు. ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన షారుఖ్.. గత కొన్నేళ్లలో వరుస డిజాస్టర్లతో మీడియం రేంజి హీరోలకు కూడా పోటీ ఇవ్వలేని స్థితికి చేరుకున్నాడు. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత అతను రెండేళ్ల పాటు ముఖానికి రంగేసుకోలేదు. కనీసం తన కొత్త సినిమా గురించి ఏ కబురూ చెప్పలేదు. యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి పెద్ద బేనర్లో ‘పఠాన్’ అనే సినిమా చేస్తున్నట్లు కొన్ని నెలల నుంచే వార్తలొస్తున్నాయి. ఈ సినిమా మొదలైనట్లు కూడా తెలుస్తోంది.

కానీ ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటిదాకా లేదు. ఎలాగూ సినిమా ఓకే అయ్యాక, షూటింగ్ కూడా మొదలుపెట్టాక దీని గురించి అనౌన్స్ చేయడానికి ఇబ్బందేంటి అంటూ షారుఖ్ అభిమానులు మండిపడిపోతున్నారు. ‘పఠాన్’ అనే పేరు ఖరారైన నేపథ్యంలో టైటిల్ లోగో విడుదల చేసి.. ఈ సినిమా మొదలైందని చెప్తే ఏంటన్నది వారి ప్రశ్న. యశ్ రాజ్ ఫిలిమ్స్ తీరుతో విసుగెత్తిపోయిన షారుఖ్ ఫాన్స్.. నిన్నట్నుంచి పఠాన్ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ ఇవ్వాలంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. అది ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అయింది. అంతర్జాతీయ స్థాయిలోనూ షారుఖ్ విదేశీ ఫ్యాన్స్ దాన్ని ట్రెండ్ చేసే ప్రయత్నం చేశారు. ఒకట్రెండు రోజుల్లో ప్రకటన రాకుంటే.. ముంబయిలోని యశ్ రాజ్ ఫిలిమ్స్ ఆఫీస్ ముందు భారీ స్థాయిలో ధర్నా చేస్తామని కూడా హెచ్చరించారు. ఈ ట్రెండ్ చూశాక అయినా ‘పఠాన్’ గురించి యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రకటన చేస్తుందేమో చూడాలి.