ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఒక సామెత. కొందరు మాత్రం రచ్చ గెలిచి, తర్వాత ఇంటికి వస్తుంటారు. శోభిత ధూళిపాళ్ల ఈ కోవకే చెందుతుంది. ఈ వైజాగ్ అమ్మాయి నేరుగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ మంచి పేరు సంపాదించింది. అక్కడ ఆమె చేసిన సినిమాలు, వెబ్ సిరీస్లు విజయవంతం అయ్యాయి. తర్వాత ‘గూఢచారి’ చిత్రంతో ఆమె సొంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆపై ‘మేజర్’ మూవీలోనూ తళుక్కుమంది.
తెలుగులో నటిస్తూనే తమిళంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ప్రెస్టీజియస్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’లో అవకాశం దక్కించుకుంది. ఐతే అందులో శోభిత చేసిన రాణి పాత్ర విషయంలో తీవ్ర విమర్శలు తప్పలేదు. రాణిగా ఆమె లుక్స్ ఏమాత్రం సూట్ కాలేదు. నటన విషయంలోనూ విమర్శలు వచ్చాయి. ‘పొన్నియన్ సెల్వన్’ సినిమానే చాలా ట్రోలింగ్ ఎదుర్కోగా.. శోభిత మీద మరింత ఎక్కువ నెగెటివిటీ కనిపించింది.
మామూలుగా మణిరత్నం సినిమాలో నటించిన కథానాయికకు ఆ చిత్ర ఫలితంతో సంబంధం లేకుండా తర్వాత అవకాశాలు వరుస కడతాయి. కానీ శోభిత మాత్రం చాలా ఏళ్ల పాటు తమిళంలో మరో అవకాశం అందుకోలేకపోయింది. కానీ అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకుని, మొత్తంగా సినిమాలు తగ్గించేసుకున్న టైంలో ఒక స్పెషల్ మూవీలో ఛాన్స్ అందుకుంది శోభిత.
తమిళంలో కొత్త తరం గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు సంపాదించిన పా.రంజిత్ దర్శకత్వంలో శోభిత నటిస్తోంది. దినేష్, ఆర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్న ‘వేట్టువుం’ చిత్రంలో శోభితనే కథానాయికగా నటిస్తోంది. పా.రంజిత్ చిత్రాల్లో సోకాల్డ్ హీరోయిన్ పాత్రలు ఉండవు. లేడీ క్యారెక్టర్లు కూడా హీరోకు దీటుగా నిలుస్తాయి. ఎక్కువగా గ్రామీణ నేపథ్యంలో సినిమాలు చేసే రంజిత్.. ఈసారి అర్బన్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా చేస్తున్నాడు.
ఇందులో శోభిత కూడా మోడర్న్ గర్ల్ రోలే చేస్తోంది. తన ఫస్ట్ లుక్ను తాజాగా లాంచ్ చేశారు. తన పాత్ర కచ్చితంగా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయేదిగా ఉంటుందని భావిస్తున్నారు. ‘పొన్నియన్ సెల్వన్’తో వచ్చిన విమర్శలన్నింటికీ ఈ సినిమాతో శోభిత బదులిస్తుందనే అంచనాలున్నాయి. ఈ సినిమా చిత్రీకరణలోనే ఒక ఫైట్ మాస్టర్ ప్రాణాలు కోల్పోవడంతో ‘వేట్టువుం’ ఇంతకుముందు వార్తల్లో నిలిచింది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates