సినీ కష్టాలు చెప్పకండి… ఇండస్ట్రీ పరువు పోతోంది

సినిమాల నిర్మాణం జూదంగా మారిపోయింద‌ని.. ఇండ‌స్ట్రీ ప‌రిస్థితి ఏమాత్రం బాగా లేద‌ని.. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌ట్లేద‌ని ఇటీవ‌ల సినీ ప్ర‌ముఖులు ఓపెన్‌గా త‌మ క‌ష్టాల గురించి వేదిక‌ల మీద ఏక‌ర‌వు పెడుతున్న సంగతి తెలిసిందే. ఏటా సినిమాల స‌క్సెస్ రేట్ ప‌డిపోతుండ‌గా.. ఈ ఏడాది ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింది.

దీనికి తోడు థియేట‌ర్ల రెవెన్యూకు సంబంధించి నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్ల మ‌ధ్య పీట‌ముడి బిగుసుకోవ‌డంతో ఇండస్ట్రీ మ‌రింత సంక్షోభంలో ప‌డ్డ సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే చాలామంది నిర్మాత‌లు నిర్వేదంతో మాట్లాడుతున్నారు. తాజాగా దిల్ రాజు సైతం.. ఇండ‌స్ట్రీ చాలా బ్యాడ్ ఫేజ్‌లో ఉందంటూ ఆవేద‌న స్వ‌రంతో మాట్లాడారు.

రాజు కంటే ముందు ఇంకా చాలామంది ఇండ‌స్ట్రీ క‌ష్టాల గురించి వివిధ వేదిక‌ల మీద ఏక‌ర‌వు పెట్టారు. ఐతే ఇలా ఇండ‌స్ట్రీ బాధ‌లు, స‌మ‌స్య‌లు చెప్పుకోవ‌డం వ‌ల్ల లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ అంటున్నాడు సీనియ‌ర్ ద‌ర్శక‌, నిర్మాత మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి. దీని వ‌ల్ల సినీ ప‌రిశ్ర‌మ ప‌రువు పోతోంద‌ని ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. సినిమాల్లో న‌ష్టం వ‌స్తుంటే ఎందుకు ఇండ‌స్ట్రీలో ఉండ‌డం, వెళ్లిపోండని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. ఎక్స్‌లో పెట్టిన పోస్టులో మ‌ధుర శ్రీధ‌ర్ ఇంకా ఏమ‌న్నారంటే..

ఏ బిజినెస్‌లోనైనా రిస్కులు, ఒత్తిడులు, నష్టాలు సహజం. వాటిని ముందే అర్థం చేసుకుని రంగంలోకి వస్తారు… సినిమా కూడా అంతే. నిజంగా పరిస్థితులు అనుకూలంగా లేవనిపిస్తే సినిమాలు తీయకండి. ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోండి. కానీ ప్రతిసారి మైకు ముందు వచ్చి “సమస్యలు… సమస్యలు…” అంటూ ఏడవడం వల్ల ఇండస్ట్రీ పరువు మాత్రమే పోతుంది.

ఇదేదో ప్రపంచ సమస్య అయినట్టు… భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం అయినట్టు. సినిమా ఒక బిజినెస్… ఛారిటీ కాదు. సిన్సియర్‌గా సినిమాలు తీయండి. వర్కౌట్ అయితే ఉండండి… వర్కౌట్ కాకపోతే బయటికి వెళ్లి వేరే బిజినెస్ చేసుకోండి. ఒక సినిమాలో నష్టం వస్తే… ఆ నష్టాన్ని తట్టుకునే శక్తి ఉంటే ఇంకో సినిమా తీయండి. లేకపోతే ఆగిపోండి.

మీ సమస్యలు, మీ కంపెనీ సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యలు అన్నీ కూడా సినిమా ప్రాజెక్ట్‌పై రుద్దకండి. సినిమా ఒక అద్భుతమైన మీడియం. దాన్ని బాధల వేదికగా మార్చొద్దు. సిన్సియర్‌గా సినిమాలు తీయండి… ప్రతి మంచి సినిమాకి ప్రేక్షకుల్లో ఒక మంచి స్థానం తప్పకుండా ఉంటుంది అని మ‌ధుర శ్రీధ‌ర్ వ్యాఖ్యానించారు.

ఈ కామెంట్ల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొంద‌రేమో శ్రీధ‌ర్ స‌రిగ్గానే చెప్పాడ‌ని, ఇండ‌స్ట్రీ జనాలు కంటెంట్ మీద దృష్టిపెట్ట‌కుండా క‌ష్టాలు చెప్పుకుంటే ఏం ప్ర‌యోజ‌నం అని అంటుంటే.. ఇంకొంద‌రేమో, ఎంత న‌ష్టం వ‌చ్చినా ప్యాష‌న్‌తో ఇదే ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతార‌ని, వారి బాధ‌ను అర్థం చేసుకోకుండా ఇంత క‌టువుగా మాట్లాడ్డ‌మేంటి అని ప్ర‌శ్నిస్తున్నారు.