గుంటూరు కారం తర్వాత మూడు సంవత్సరాల కాలాన్ని త్యాగం చేసి వారణాసి కోసం కష్టపడుతున్న మహేష్ బాబు తెరమీద దర్శనం జరగాలంటే ఇంకో పదకొండు నెలలు ఎదురు చూడాలి. రాజమౌళి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేసేశారు కానీ నిజంగా ఆ మాట మీద కట్టుబడి ఉంటారా లేదానేది రకరకాల పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అసలే అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఏ నిమిషంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించడం కష్టం.
ఇదిలా ఉండగా మహేష్ బాబు తర్వాత చేయబోయే సినిమా గురించి రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రశాంత్ నీల్ అని ఒకరు, బుచ్చిబాబు స్టోరీ సిద్ధం చేశాడని మరొకరు, లేదు సందీప్ రెడ్డి వంగాతో కాంబో ఉండొచ్చని మరొకరు ఇలా ఎవరికి తోచిన రీతిలో కథనాలు అల్లేస్తున్నారు. వాస్తవం ఏమిటంటే మహేష్ బాబు అసలే నెరేషన్లు వినడం లేదట. పలువురు దర్శక నిర్మాతలు కలవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ సున్నితంగా నో చెబుతున్నట్టు సమాచారం.
దీనికి కారణం లేకపోలేదు. వారణాసితో మహేష్ బాబు మార్కెట్ దేశాల హద్దులు దాటి ఎక్కడికో వెళ్లిపోయేలా ఉంది. ఎంధుకంటే జక్కన్న చేస్తున్న ప్లానింగ్ ఆ స్థాయిలో ఉంది. పలు ఇంటర్నేషనల్ స్టూడియోలతో టై అప్ పెట్టుకుంటున్నారు. సినిమా ఒక స్టేజికి వచ్చాక రషెస్ చూపించే పెద్ద ఎత్తున బిజినెస్ డీల్స్ చేసేలా ఉన్నారు. టైటిల్ వీడియోతోనే అంత సంచలనం రేపిన రాజమౌళి ఇక ఒరిజినల్ విజువల్స్ వాడితే ఏ స్థాయి మార్కెటింగ్ చేస్తారో వేరే చెప్పాలా.
సో మహేష్ బాబు మీద ఇప్పుడు పెడుతున్న బడ్జెట్, ఇస్తున్న రెమ్యునరేషన్లు అమాంతం పెరిగిపోయే ఛాన్స్ ఉంది. అది తేలాలంటే వారణాసి విడుదల కావాలి. అప్పుడు తన మీద ఎలాంటి కథలు వర్కౌట్ అవుతాయి, గ్లోబల్ ఆడియెన్సు ని మెప్పించాలంటే ఏమేం చేయాలనే దాని మీద స్పష్టత వస్తుంది. ఏప్రిల్ 7 ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతున్న వారణాసిలో ప్రియాంకా చోప్రా హీరోయిన్ కాగా పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం ఆకర్షణగా నిలవనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates