ప్రీమియర్ల సంగతి తేల్చమంటున్న ఫ్యాన్స్

పెద్ది విడుదల కేవలం ఎనిమిది రోజుల్లో జరగనుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. భోపాల్ ఈవెంట్ బ్లాక్ బస్టర్ కాగా బెంగళూరు ప్రెస్ మీట్ కొంచెం హడావిడిగా జరిగింది. శివ రాజ్ కుమార్ హాజరు ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఏమంత హైలైట్ కాలేకపోయింది. శివన్న పవన్ కళ్యాణ్ ని తలుచుకోవడం తప్ప చెప్పుకోదగ్గ విశేషం లేకపోయింది. ఇంకోవైపు బుచ్చిబాబు పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనుల్లో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంచితే పెద్దికి ప్రీమియర్ షోలు ఉంటాయా లేదానే సస్పెన్స్ తో మెగా ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ఇబ్బంది లేదు. అడగటం ఆలస్యం అనుమతులు వస్తాయి. అందులోనూ చరణ్ మూవీ అంటే నో డిస్కషన్. ఆరు వందల రూపాయల ఫ్లాట్ రేట్ తో ఆల్రెడీ అప్లికేషన్ వెళ్లిపోయిందని అంతర్గత సమాచారం. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ సంతకం కూడా పెట్టేశారట. కాకపోతే ఉత్తర్వులు ఇప్పుడే బయటికి వదలరు.

అసలు సమస్య తెలంగాణలో ఉంది. ఎగ్జిబిటర్లు తమకు పర్సెంటెజ్ కావాలనే డిమాండ్ తో గత వారం పది రోజులుగా దాని మీదే పోరాడుతున్నారు. టికెట్ ధరల పెంపు వద్దంటున్నారు. బెనిఫిట్ షోల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో పర్మిషన్లు వస్తాయా రావా అనే టెన్షన్ అభిమానుల్లో లేకపోలేదు. సిఎం రేవంత్ రెడ్డి దీని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే సస్పెన్స్ యావత్ ఇండస్ట్రీలో ఉన్న మాట వాస్తవం.

కేవలం ఏపీలో ముందురోజు రాత్రి షోలు వేసి, మరుసటి రోజు నైజామ్ లో వేస్తే రిస్క్ అవుతుంది. టాక్ తో పాటు సోషల్ మీడియా స్పాయిలర్స్ చాలా డ్యామేజ్ చేస్తాయి. దేవర దీని వల్ల ప్రభావితం చెందటం తారక్ ఫ్యాన్స్ కి బాగా గుర్తు. పెద్దికి అలా జరగకూడదంటే ఒకే సమయంలో అన్ని చోట్ల షోలు పడాలి. తెలంగాణలో ఛాన్స్ లేకపోతే ఏపీవి కూడా వద్దనుకోవాలి. నిర్మాతకు మాత్రం పెద్ద సంకటం వచ్చి పడింది. ఈ నెలాఖరులోగా మొత్తం వ్యవహారం సెటిలవ్వాలి. లేదంటే చివరి నిమిషం ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటాయి.