ఆ సినిమా నేను చేయట్లేదు-నయనతార


తమిళంలో కొంచెం పెద్ద స్థాయి లేడీ ఓరియెంటెడ్ సినమా చేయాలంటే ఫిలిం మేకర్లు ముందుగా చూసేది నయనతార వైపే. కెరీర్లో తొలి పదేళ్లు ఎక్కువగా పెద్ద స్టార్ల సినిమాల్లో గ్లామర్ రోల్స్‌కు పరిమితం అయిన నయనతార.. గత ఐదారేళ్లలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుని ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తూ వస్తోంది. ‘మయూరి’ (తమిళంలో మాయ) మొదలుకుని.. ఇటీవలే వచ్చిన ‘అమ్మోరు తల్లి’ (మూక్కుత్తి అమ్మన్) వరకు నయనతార నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా వరకు మంచి ఫలితాన్నే అందుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఆమెను లీడ్ రోల్‌లో పెట్టి ఒక వీర వనిత కథను సినిమాగా తీయబోతున్నట్లు తమిళ మీడియాలో ప్రచారం జరిగింది. శివగంగ సీమలో 17వ శతాబ్దంలో తెల్లదొరలపై పోరు సాగించిన ధీరవనిత వేలు నాచ్చియార్‌ జీవిత విశేషాలతో ఓ సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో నయనతారే లీడ్ రోల్ చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి.

ఐతే నయనతార టీం వెంటనే అలెర్టయింది. వేలు నాచ్చియార్ జీవిత కథతో తెరకెక్కే సినిమాలో నయన్ నటిస్తోందని మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని అధికారికంగా ప్రెస్ నోట్ ఇచ్చింది. వేలు నాచ్చియార్ కథతో సినిమా చేయడానికి నయన్‌కు అభ్యంతరం లేకపోవచ్చేమో. ఎందుకంటే ఆమె కథలో కావాల్సినంత విషయం ఉంది. కానీ ఆ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న దర్శకుడి విషయంలో ఆమెకు అభ్యంతరాలు ఉండొచ్చు.

ఇంతకుముందు ‘తిరుట్టుపయలే’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన సుశీ గణేశన్ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. అతను విక్రమ్‌తో ‘మల్లన్న’ అనే సినిమా కూడా తీశాడు. కానీ అది డిజాస్టర్ అయ్యాక అతను అడ్రస్ లేకుండా పోయాడు. గత దశాబ్ద కాలంలో అతడి నుంచి చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు. ‘తిరుట్టుపయలే-2’ మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది. సుశికి వివాదాస్పదుడిగానూ పేరుంది. అలాంటి దర్శకుడితో ఇప్పుడు సినిమా చేయడం అనవసరం అని నయన్ భావిస్తుండొచ్చు. ఐతే నయన్ కాదంటే కీర్తి సురేష్‌తో వేలు పాత్ర చేయాలని సుశి భావిస్తున్నట్లు సమాచారం. ఆమె కూడా ‘మహానటి’ తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.