తమిళ టాప్ స్టార్లలో ఒకడైన రవి మోహన్.. రెండేళ్ల ముందు భార్య ఆర్తి నుంచి విడిపోవడం.. కెనీషా అనే సింగర్తో రిలేషన్షిప్లోకి వెళ్లడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఐతే ఆర్తితో 16 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరదించినందుకు మొదటి నుంచి రవినే అందరూ నిందిస్తున్నారు. కెనీషా మీద మోజుతోనే ఆర్తిని వదిలేశాడంటూ రవిని.. అతణ్ని వలలో వేసుకుందంటూ కెనీషాను సోషల్ మీడియాలో చాన్నాళ్ల నుంచి ట్రోల్ చేస్తూ వస్తున్నారు నెటిజన్లు.
ఐతే ఈ ట్రోలింగ్ ఇటీవల శ్రుతి మించడంతో కెనీషా.. నిన్న రాత్రి రవి నుంచి తాను విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. అంతే కాక సోషల్ మీడియా నుంచి కూడా ఆమె డీయాక్టివేట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రవి మోహన్ ప్రెస్ మీట్ పెట్టాడు. అతను తన మాజీ భార్య ఆర్తితో పాటు సోషల్ మీడియా జనాల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు.
రవి ప్రెస్ మీట్లో గట్టిగట్టిగా అరవడమే కాక.. కన్నీళ్లు కూడా పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తన భార్య నుంచి విడాకులు వచ్చే వరకు ఏం మాట్లాడకూడదు అని రెండేళ్లుగా తాను మౌనంగా ఉన్నానని.. కానీ తన మౌనం చేతకానితనంలా అనిపిస్తోందని రవి మోహన్ వ్యాఖ్యానించాడు.
రెండేళ్లుగా తనకు తన భార్య నరకం చూపిస్తోందని.. తన పిల్లలతో సంబంధాలు తెంచేసిందని.. వాళ్లతో మాట్లాడనివ్వట్లేదని.. వాళ్లను తన నుంచి కాపాడడానికి బాడీ గార్డులను పెట్టిందని.. తన ఫోన్ కాల్ కూడా వాళ్లకు చేరకుండా చేసిందని రవి మోహన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
16 ఏళ్లు కలిసి ఉన్నపుడు తనను ఇంటర్వ్యూల్లో దేవుడు అంటూ కొనియాడిన వ్యక్తి ఇప్పుడు తన మీద నిందలేస్తోందని అతను విమర్శించాడు. కెనీషా విషయం ప్రస్తావిస్తూ జనాలకు వాస్తవాలు తెలియకుండా.. తనను, ఆమెను నిందిస్తున్నారని.. ఫెమినిజం పేరుతో తన మీద విమర్శలు గుప్పిస్తున్నారని రవి అన్నాడు.
సైబర్ బుల్లీయింగ్ అన్నది దారుణమైన విషయమని.. దీని వల్ల ప్రాణాలు పోతున్నాయని.. దీని తీవ్రత తెలియకుండా జీవితాలు నాశనం చేస్తున్నారంటూ రవి మోహన్ గట్టి అరుస్తూ.. దాదాపుగా ఏడుస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందరూ కోరుకున్నట్లే ఇప్పుడు కెనీషా తనను వదిలి వెళ్లిపోయిందని.. ఆమె ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటానని రవి అన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
