తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్ మీట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎవరికి వారు నువ్వా నేనా అని స్టేట్ మెంట్స్ ఇవ్వడం డ్యామేజ్ మరింత పెంచింది. ఏకంగా మీడియా కెమెరాల ముందు విభేదాలు బయట పెట్టుకోవడంతో సోషల్ మీడియాకు మెటీరియల్ దొరికింది. ఇవాళ ఫిలిం ఛాంబర్ పెద్దలు అన్ని వర్గాలతో మూకుమ్మడి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయనే లీక్ బయటికొచ్చింది. చివరగా ఒక కమిటీ వేయాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా నిర్మాతలు సి కళ్యాణ్, దిల్ రాజు వెల్లడించడం పెద్ది అభిమానులకు చెవుల్లో పాలు పోసినట్టు అయ్యింది. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ మూడు సెగ్మెంట్స్ నుంచి చెరో అయిదు మందిని ఎంచుకుని మొత్తం పదిహేను మందితో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారట. వీళ్ళు అన్ని సమస్యలను కూలంకుషంగా విశ్లేషించి పరిష్కారం తీసుకొస్తారు.
దీనికి ఒక రెండు నెలలు టార్గెట్ గా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అంటే అప్పటిదాకా పాత పద్దతే అమలులో ఉంటుంది. సో పెద్దికి హైదరాబాద్ లో సింగల్ స్క్రీన్స్ లో షోలు ఉంటాయా లేదానే దానికి చెక్ పడిపోయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కూకట్ పల్లి దాకా అన్ని చోట్లా వేసుకోవచ్చు. అయితే ఈ గడువుకి అందరూ ఒప్పుకున్నారా లేదానేది ఇంకొంచెం టైం ఆగితే క్లారిటీ వస్తుంది. సి కళ్యాణ్ మాత్రం మీటింగ్ అంతా కూల్ గా జరిగిందనే సంకేతాలు ఇచ్చారు.
పెద్దికి ఇబ్బంది తప్పింది కానీ రాబోయే మార్పులకు మిగిలిన ప్యాన్ ఇండియా సినిమాలు సిద్ధపడాల్సి ఉంటుంది. ఒకవేళ కమిటీ కనక అండర్ ప్రొడక్షన్, ఫస్ట్ కాపీ రెడీ సినిమాలకు కూడా కొత్త విధానం అప్లై కాదని నిర్ణయిస్తే వారణాసి, స్పిరిట్ సైతం సేఫ్ అవుతాయి. కానీ ఎగ్జిబిటర్లు దానికి ఒప్పుకోకపోవచ్చు. అలా జరిగితే రెండు మూడు నెలల తర్వాత రిలీజయ్యే ఏ సినిమా అయినా కొత్త సిస్టంలోకి వస్తుంది. చూడాలి ఈ కాంట్రావర్సి కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates
