తమ్ముడికి జరిగింది… అన్నకు రిపీటయ్యింది

గత ఏడాది డిసెంబర్ లో కార్తీ నటించిన వా వతియర్ / అన్నగారు వస్తారు చివరి నిమిషంలో విడుదల ఆగిపోయిన విషయం అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టేసి టికెట్లు అమ్మాక రిలీజ్ లేదని చెప్పడం షాక్ కు గురి చేసింది. ముఖ్యంగా తమిళనాడు ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తర్వాత అష్టకష్టాలు పడి అన్ని క్లియర్ చేసుకుని జనవరి సంక్రాంతికి థియేటర్లకు తీసుకొచ్చారు. ఇంతా చేస్తే అదేమో దారుణంగా డిజాస్టరయ్యింది.

తమ్ముడికి అలా జరిగితే తాజాగా అన్నయ్య సూర్య కూడా అలాంటి సంకట స్థితిలో ఇరుక్కున్నాడు. ఇవాళ ప్రేక్షకుల ముందుకు రావాలిన కరుప్పు / వీరభద్రుడు ఇంకొన్ని గంటల్లో షోలు పడతాయి అనంగా పెద్ద బాంబు వేసింది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలు కావాల్సిన షోలు ఆపేశారు. పోనీ మధ్యాన్నం ఉందనుకుంటే అదీ జరగలేదు. ఇక సాయంత్రం, రాత్రి షోల మీద కూడా అనుమానాలున్నాయి. అయితే రేపు లేదంటే ఇంకో వారం ఆగాల్సిందేనని చెన్నై రిపోర్ట్.

నిర్మాత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదం వల్లే కరుప్పుకి చివరి నిమిషంలో ల్యాబ్ క్లియరెన్సులు ఆగాయని తెలిసింది. దర్శకుడు ఆర్జె బాలాజీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో వదిలారు. ఏ క్షణమైనా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఎమోషనల్ చెప్పడం వైరల్ అవుతోంది. అయితే నిజంగా పరిష్కారం దిశగా వెళ్తున్నారా లేదానేది తెలియాల్సి ఉంది. సూర్య స్వయంగా రంగంలోకి దిగారని టాక్. అయినా సరే క్లిష్టంగానే ఉందట.

మొత్తానికి ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని అన్నదమ్ములకు ఒకే సమస్య రావడం విషాదం. సూర్య గత కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్ లేక ఆశలన్నీ కరుప్పు మీదే పెట్టుకున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ పూర్తిగా క్లాస్ మూవీ కాబట్టి మాస్ ని ఆకట్టుకోవడానికి కరుప్పునే మంచి ఛాన్స్ అనుకున్నాడు. తీరా చూస్తే పరిణామాలేమో రివర్స్ లో ఉన్నాయి. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ కోర్ట్ రూమ్ ప్లస్ యాక్షన్ డ్రామాకు సాయి అభ్యంక్కర్ సంగీతం సమకూర్చడం మరో ప్రధాన ఆకర్షణ.